అమరావతిలో వారికి రూ.1కే చ.అడుగు భూమి: 50 ఎకరాల్లో టవర్
అమరావతిలోని స్టార్టప్ ఏరియా ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్ సంస్థల కన్సార్టియం మొదట కేటలైటిక్ డెవలప్మెంట్ కింద 50 ఎకరాలను అభివృద్ధి చేయనుంది.
అమరావతి: అమరావతిలోని స్టార్టప్ ఏరియా ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్ సంస్థల కన్సార్టియం మొదట కేటలైటిక్ డెవలప్మెంట్ కింద 50 ఎకరాలను అభివృద్ధి చేయనుంది.
ఈ 50 ఎకరాలను నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 50 ఎకరాలకు చ.అడుగుకి రూపాయి చొప్పున ధర నిర్ణయించారు. ఎకరం అంటే 43,560 చదరపు అడుగులు.
ఆ లెక్కన ఎకరం రూ.43,560 చొప్పున సింగపూర్ సంస్థల కన్సార్టియానికి సీఆర్డీఏ అందిస్తుంది. 50 ఎకరాల్లో ఉత్ప్రేరకాభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
టవర్ నిర్మాణం
తొలి ప్రాజెక్టుగా ఎనిమిది లక్షల చ. అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన టవర్ నిర్మించనుంది. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది నిబంధన. రెండో దశలో మరో ఎనిమిది లక్షల చ. అడుగుల టవర్ నిర్మిస్తుంది. మొత్తం 1,691 ఎకరాల స్టార్టప్ ప్రాంతంలో ఉత్ప్రేరకాభివృద్ధి కింద చేపట్టే 50 ఎకరాలు ఎక్కడన్నది ఇంకా గుర్తించలేదు.
ఎలా..
దీనిలో నిర్మించే టవర్లు ఎంత ఎత్తు ఉంటాయి? ఎన్ని అంతస్తులు ఉంటాయి? జంట టవర్లలా పక్కపక్కన ఉంటాయా? టవర్లతో పాటు 50 ఎకరాల్లో ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపడతారు? వంటి విషయాల్లోను స్పష్టత రావాల్సి ఉంది.
ఆ రెండు గ్రామాలూ స్టార్టప్ ప్రాంత స్థాయికి!
రాజధానిలోని ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు స్టార్టప్ పరిధిలోకి రానున్నాయి. ఈ గ్రామాలను కదిలించబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. స్టార్టప్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఈ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను కూడా ఏడీపీ తీసుకోనుంది.
ఇమిడిపోయేలా..
స్టార్టప్ ప్రాంతంలో ఆధునిక ప్రమాణాలతో మౌలిక వసతులు నిర్మించనున్న నేపథ్యంలో దీని పరిధిలోని గ్రామాల్ని కూడా ఆ స్థాయికి తేవడం, స్టార్టప్ ప్రాంతంలో రెండు గ్రామాలు ఇమిడిపోయేలా చూడడం దీని ముఖ్య ఉద్దేశం.