సీఎం రమేష్ కంపెనీలో రూ.100 కోట్లకు లెక్కలు లేవు...ఐటి శాఖ నివేదిక:"ఇండియన్ ఎక్స్ ప్రెస్" కథనం
న్యూఢిల్లీ:టీడీపీ ఎంపి సీఎం రమేష్ నివాసం,కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఐటి అధికారులు గుర్తించారని ప్రసిద్ద మీడియా సంస్థ 'ఇండియన్ ఎక్స్ప్రెస్' ఒక కథనంలో పేర్కొంది.
సిఎం రమేష్కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ.74 కోట్ల నిధులను గుర్తింపు లేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్లు...అలాగే మరో రూ.25 కోట్ల బిల్లులు అనుమానాస్పదమైనవిగా ఐటి శాఖ కనుగొన్నట్లు 'ఇండియన్ ఎక్స్ప్రెస్' తన కథనంలో వెల్లడించింది. ఈనెల 12న ఐటీ అధికారులు సిఎం రమేష్ కు చెందిన హైదరాబాద్లోని కంపెనీ కార్యాలయంలో, అలాగే కడప పోట్లదుర్తి నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
లెక్కలు లేవు...ఐటి శాఖ నివేదిక
ఈ నేపథ్యంలో సోదాల సందర్భంగా ఆయా స్థలాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఐటి అధికారులు క్షుణ్నంగా పరిశీలించిన మీదట సీఎం రమేష్ డైరెక్టర్గా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులను దారిమళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు గుర్తించారని ఆ కథనంలో వివరించారు. గడచిన ఆరేళ్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్...ఎడ్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు రూ.12 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్...కథనం
అయితే ఆ రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ అనేది ఎక్కడా లేదని, వేరే ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా ఆచూకీ లభించలేదని ఐటీ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించిందని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' తన కథనంలో పేర్కొంది. ఎడ్కోతో జరిపిన కరస్పాండెన్స్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెంట్ సాయిబాబు ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించినట్లు ఐటి అధికారులు గుర్తించారట.
అది...షెల్ కంపెనీనే
మరోవైపు ఎడ్కో స్టాంప్, సీల్ ఆయన వద్ద ఉన్నట్టు ఐటి అధికారులు గుర్తించడంతో నిధుల దారిమళ్లింపునకే ఆ షెల్ కంపెనీని వాడుకున్నట్లు తెలుస్తోందని నివేదిక పేర్కొందట. అలాగే రూ. 25 కోట్ల బిల్లుల చెల్లింపులకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ కానీ, అకౌంటెంట్ కానీ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని ఐటి నివేదిక పేర్కొన్నట్లు తెలిపింది. స్టీల్ సరఫరాదారుల నుంచి రూ. 12.24 కోట్లు వసూలైనట్టు కంపెనీ చూపగా, నగదు లావాదేవీల్లో ఆ మొత్తానికి వివరణ లేదని తేలిందట.
కథనం...కలకలం
ఢిల్లీ సబ్కాంట్రాక్టర్ ఎన్కేజీ కన్స్ర్టక్షన్స్కు రూ 6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు చూపలేకపోయారని ఐటి శాఖ నివేదిక వెల్లడించిందట. టిడిపి ఎంపి సిఎం రమేష్ పై ఐటి దాడులకు సంబంధించి ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' ప్రచురించిన ఈ కథనం కలకలం రేపుతోంది.