ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు
హైదరాబాద్: ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) పాలకమండలి నిర్ణయించింది. సోమవారం సమావేశమైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ.20 కోట్లు విడుదలచేసింది.
దేవుని కడపలో భవన సముదాయం నిర్మాణానికి రూ.5కోట్లు విడుదల చేసింది. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉద్యోగులకు ప్రోత్సహాలను మంజూరు చేస్తూ నిర్ణయిం తీసుకుంది. టిటిడి శాశ్వత ఉద్యోగులకు బ్రహ్మోత్సవ ప్రోత్సాహకంగా రూ.12,200, ఒప్పంద ఉద్యోగులకు రూ.6,100 ఇవ్వాలని నిర్ణయించారు.
రాఘవేంద్ర స్వామి మఠానికి తిరుమలలో 10వేల చదరపు అడుగుల స్థలం కేటాయించారు. భారీ వర్షాలతో నీటమునిగిన చెన్నైలో బాధితులను ఆదుకునేందుకు వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
మహానందిలోపూజలు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మహానంది శైవక్షేత్రంలోపూజలు నిర్వహించారు. అనంతరం రూ.3 కోట్లతో నిర్మించిన ప్రసాదాల తయారీకేంద్రం, అభిషేక మండపం, నిత్యాన్నప్రసాదశాలను ప్రారంభించారు. కేఈతో పాటుగా మంత్రి మాణిక్యాలరావు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.