ఇయర్ ఫోన్, హెడ్ సెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల ఫైన్ ? ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..
ఏపీలో వాహనాల డ్రైవర్లు ఇయర్ ఫోన్ లేదా హెడ్ సెట్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల రూపాయల ఫైన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో వాహనాలు నడిపే వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో పొరబాటున ఓసారి ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే ఇంత భారీ జరిమానా విధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఏపీ ప్రభుత్వం ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల్ని నడిపేవారు కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇయర్ ఫోన్లు, హెడ్ సెట్స్ పెట్టుకుంటే ఏకంగా రూ.20 వేల రూపాయల ఫైన్ విధిస్తున్నారన్న వార్తలు నిన్నటి నుంచి వాట్సాప్ గ్రూప్ లతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరికి రవాణాశాఖ కమిషనర్ దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో వాహనాల డ్రైవర్లకు ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ సెట్స్ కానీ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ .20 వేల ఫైన్ విధించబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారమంతా అసత్యమని రవాణాశాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇప్పటివరకూ ఫైన్లు విధిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇప్పటివరకూ హెడ్ సెట్ లేదా ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.1500 నుంచి రూ.2000 వరకూ జరిమానాలు విధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు
అలాగే వాహనదారులు పదే పదే ఈ నిబంధనను ఉల్లంఘించి ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే గరిష్టంగా రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. దీనికి విరుద్ధంగా రూ.20 వేల వరకూ ఫైన్ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. అలాగే జరిమానాల పెంపు అవకాశం కూడా లేదన్నారు. దీంతో వాహనదారులు ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.












Click it and Unblock the Notifications