నరేంద్రమోడీ, చంద్రబాబును కలిపింది ఎవరంటే..
''ఆజాదీకా అమృత్ మహోత్సవ్'' సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా ఐదు నిముషాలు మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక హోదా కోసం మోడీతో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేంద్రంలో తిరిగి భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడంతోపాటు ఏపీలో తన ప్రత్యర్థి జగన్ ముఖ్యమంత్రి కావడంతో మూడు సంవత్సరాలుగా తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. బీజేపీతో సఖ్యతగా ఉండటానికి ఈ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కాస్తంత ఫలించాయని, పార్టీ క్యాడర్ ను ఆయన ఢిల్లీ పర్యటన ఉత్సాహపరిచిందని భావిస్తున్నారు.

పరిణామాలు బేరీజు వేసుకున్న
నరేంద్రమోడీ, అమిత్ షా ఇద్దరూ ఈ మూడు సంవత్సరాల కాలంలో చంద్రబాబును దూరంగా నే పెట్టారు. ఇటీవలికాలంలో రాజకీయ పరిణామాలు మారుతుండటంతోపాటు తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో బీజేపీ అధినాయకత్వం ఉంది. చంద్రబాబును కలవడానికి కూడా వీరిద్దరూ ఇష్టపడలేదంటూ కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే అసలు ఎందుకు విభేదాలు వచ్చాయి? వాటికి పరిష్కారం ఏమిటి? భవిష్యత్తులో చంద్రబాబు వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.. అనే సూత్రాన్ని, తదితర పరిణామాలను బేరీజు వేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రంగంలోకి దిగింది.

చంద్రబాబుపై దృష్టిసారించిన ఆర్ఎస్ఎస్
దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణపై దృష్టి సారించింది. ఈ సంస్థ తెప్పించుకున్న సమాచారంలో 40 నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఉండటం, వారిలో ఎక్కువశాతం తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపుతుండటంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉందని వెల్లడైంది. బాబుతో స్నేహంగా ఉంటే రానున్న తెలంగాణ ఎన్నికలు బీజేపీకి బాగా కలిసివస్తాయని ఆ సంస్థ భావించినట్లు సమాచారం. అంతేకాకుండా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బాబుతో సఖ్యతగా ఉంటూనే వస్తోంది. దీంతో ఆ సంస్థే చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉభయ కుశలోపరిగా ఉంటుంది..
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏపీకన్నా తెలంగాణలోనే కార్యకర్తల బలం ఎక్కువ. తర్వాత బలమైన నాయకులు లేకపోవడం, ఎన్నికల కోసం టీడీపీని బూచిగా చూపించి సెంటిమెంట్ రాజేస్తుండటం లాంటి కారణాలతో ఆ పార్టీ వెనక్కి తగ్గిందని, అటువంటి పార్టీతో స్నేహం జరిపితే కచ్చితంగా తెలంగాణలో అధికారం లేదంటే గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్ఎస్ఎస్ గుర్తించినట్లు బీజేపీ నేతలు కొందరు వెల్లడించారు. దీంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీకి, అమిత్ షాకి నచ్చచెప్పారని, బాబు కూడా ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నారని, ఇద్దరికీ ఉభయకుశలోపరిగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో కూడా బాబుతో పొత్తుకు మోడీని ఒప్పించింది ఆర్ఎస్ఎస్ అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications