ఆర్టీసి సమ్మె ఉధృతం: తిరుమలకు బస్సులు బంద్

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారంనాడు సమ్మె నాలుగో రోజుకు చేరింది. అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పు చేయాలని తలపెట్టారు.

సమ్మెలో భాగంగా తిరుమలకు వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. చిత్తూరులో కార్మికులపై లాఠీచార్జికు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకుంటామని కార్మికసంఘాలు ప్రకటించాయి. విజయవాడలో జరిగిన రాజకీయ పార్టీల ఐక్యవేదిక, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాత్కాలిక సిబ్బంది సాయంతో సమ్మెను విచ్ఛినం చేసేందుకు కుట్ర జరుగుతోందని రాజకీయ నేతలు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మిక సంఘాల పోరాటానికి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎస్మా ప్రయోగిస్తే ఎంతకైనా తెగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ తేల్చి చెప్పింది. నేటి నుంచి బస్సులు తిరిగితే అడ్డుకుంటామని చెప్పారు.

విజయవాడలో తోపులాట

విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌ ఎదుట వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన
జరిగింది. తాత్కాలిక డ్రైవర్లతో బస్టాండ్‌ నుంచి బయలుదేరిన బస్సులను వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. బస్సులు బస్టాండు నుంచి బయటికి రాకుండా రాజకీయ నాయకులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న కార్మికులకు, పోలీసులకూ మధ్య తోపులాట జరిగింది. రాజకీయ పార్టీల ఆందోళనతో విజయవాడ, హైదరాబాద్ హైవేపై భారీగా వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్ జాం అయింది.

 RTC strike intensified, buses stopped to Tirumala

లాఠీచార్జీతో గుండెపోటు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల లాఠీచార్జీతో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఖమ్మంలో అడ్డుకునేందుకు యత్నం

ఖమ్మం జిల్లాలోని ఆర్టీసీ డిపో నుంచి బస్సులను రోడ్డెక్కించేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొత్తగూడెం నుంచి ఖమ్మం చేరుకున్న ఐదు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ తాత్కాలిక డ్రైవర్‌ చేతికి స్వల్పంగా గాయమైంది. కార్మికుల ఆందోళనలతో వైరా రోడ్డుపై బస్సులు నిలిచిపోయాయి.

దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో బస్సులను డిపోలకు తరలించారు. మరోవైపు సాంకేతిక లోపంతో బస్సు రోడ్డుపై నిలిచిపోతుండటంతో వాటిని నెట్టలేక పోలీసులు ఇబ్బందులకు గురయ్యారు.

రేపు ధర్నాలు

రేపు రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ఈయూనేత పద్మకర్ ప్రకటించారు. ఎల్లుండి కలెక్టర్లు, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు ఇస్తామని ఆయన తెలిపారు. అద్దె బస్సుల వల్ల ప్రయాణికులపై అధిక భారం పడుతోందని ఈయూనేత పద్మాకర్‌ అన్నారు. కార్మికుల సమ్మెను సాకుగా చేసుకొని అద్దె బస్సుల యజమానులు నాలుగు రెట్ల చార్జీలు పెంచారని ఆయన ఆరోపించారు.

చార్జీలు పెంచకుండా ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచవచ్చని, దీనిపై ఆర్టీసీ యాజమాన్యానికి అనేక సూచనలు చేశామని పద్మాకర్ అన్నారు. సామరస్య వాతావరణంలో చర్చలు జరగాలని,. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఈయూ నేత పద్మాకర్‌ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+