AP Special Status:ఆయన వల్లే ఏపీకి హోదా రాలేదా -మాజీ ఐఏఎస్ సంచలనం..!!
ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటం వెనక ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారంటూ రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన సమయంలో కీలక బాధ్యతలు పర్యవేక్షించిన పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలంగా మారుతున్నాయి. హోదా అడ్డుకున్న అధికారి ఎవరు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతున్న వేల మరో కీలక అంశం చర్చకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం ఒక ఐఏఎస్ అధికారేనని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో హోదా అమలు విషయంలో విభజన సమయంలో జరిగిన ప్రయత్నాలు, అమలు కాకపోవటం వెనక విషయాలను వెల్లడించారు. విభజన సమయంలో హామీల అమలు వ్యవహారంలో నాడు పీవీ రమేష్ పనిచేశారు. విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

జూన్ 2, 2014 అపాయింట్ డే గా ఖరారు చేశారు. అదే రోజు ప్రత్యేక హోదాకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కేంద్ర క్యాబినెట్ ప్రణాళిక సంఘాన్ని కోరిందని పీవీ రమేష్ వెల్లడించారు. అది ఎన్నికల సమయం కావడంతో తానే చొరవ తీసుకొని హోదా అంశాన్ని పూర్తి చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమావేశాలకు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారి హాజరు కాలేదని చెప్పారు. ఆ అధికారి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారని వెల్లడించారు. ఆయన ఆ ఒక్క సమావేశానికి వచ్చి ఉంటే హోదా వచ్చేసి ఉండేది అంటూ పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారాయి.
ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే తమకు అభ్యంతరం లేదని హోదా నోటిఫికేషన్ ఇద్దామంటూ నాటి ప్రణాళికా సంఘం కార్యదర్శి చెప్పారని పీవీ రమేష్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్థిక శాఖ అధికారి రాకపోవడంతో హోదా రాలేదని వివరించారు. ఆ అధికారి తెలంగాణ క్యాడర్ కోరుకున్నారని,ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఏపీకి వెళ్లారని పీవీ రమేష్ చెప్పుకొచ్చారు. దీంతో పీవీ రమేష్ ప్రస్తావించిన ఆ ఐఏఎస్ ఎవరనేది చర్చ మొదలైంది ప్రస్తుతం ఏపీలోని రెవెన్యూ శాఖ అధికారిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ గా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఆ అధికారి గతంలో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేశారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆ అధికారి కేంద్ర ఆర్థిక శాఖలోని బడ్జెట్ విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఆ అధికారి సమావేశానికి హాజరు కాకపోవటం వలనే హోదా రాలేదంటూ పీవీ రమేష్ చెబుతున్న అంశాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా రాజకీయ నిర్ణయమైన హోదా విషయంలో కేంద్రం ఇవ్వాలని భావిస్తే ఇవన్నీ కారణాలే కాదని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎన్నికలవేళ మరోసారి ఏపీ ప్రత్యేక హోదా వ్యవహారం చర్చకు రావడంతో ఇది ఎటువైపు ఉందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications