షాక్: టీడీపీలోకి ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. ఏపీ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి, శాసన మండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. యువజన కాంగ్రెస్ పార్టీ నుండి పీసీసీ వరకు దాదాపు 30 ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ప్రస్తుతం రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర, అంతకుముందు తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రతినిధిగా అభ్యర్థుల ఎంపికలో పాలు పంచుకున్నారు. అలాంటి రుద్రరాజు పద్మరాజు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
మోడీ ప్రభుత్వానిది రైతు వ్యతిరేక ఎజెండా: పళ్లంరాజు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం లౌకికవాదానికి వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక విధానాల ఎజెండాను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ కేంద్ర మాజీమంత్రి పళ్ళంరాజు సోమవారం విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన కాంగ్రెస్ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధి కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
అయితే గాంధీ, నెహ్రూ కుటుంబం నిర్వహించిన కార్యక్రమాలను మారుస్తోందని ఆరోపించారు. ఎంతోకాలంగా ప్లానింగ్ కమిషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. అయితే సిస్టమ్కు భిన్నంగా నీతి అయోగ్ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న తీరును సరికాదన్నారు.