బ్రదర్స్పై ప్రచారం: జగన్వైపు చిరు, రూ.100కోట్ల తర్వాత పవన్ ఫుల్స్టాప్?
విజయవాడ: గత కొద్ది రోజులుగా మెగా సోదరులు... చిరంజీవి, పవన్ కళ్యాణ్ల పైన వివిధ ప్రచారాలు సాగుతున్నాయి. చిరంజీవి బిజెపిలోకి వెళ్తారనే ఊహాగానాలు మూడు రోజుల క్రితం వచ్చాయి. వాటిని చిరంజీవి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
అయినప్పటికీ తాజాగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునని ప్రచారం సాగుతోంది. చిరంజీవి మూడు రోజుల క్రితం మొగల్తూరు మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కంటే వైసిపి వారి హడావుడి ఎక్కువయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన జగన్కు దగ్గరవుతున్నారా అనే చర్చ సాగుతోందనే ప్రచారం సాగుతోంది.
Also Read: ఈ వారం టాప్ విశేషాలు
చిరంజీవి చిన్న తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన తాజాగా మరో ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ మరికొద్ది రోజుల్లో సినిమాలకు ఫుల్స్టాఫ్ పెట్టవచ్చునని తెలుస్తోందనే ప్రచారం కొత్తగా పుట్టుకు వచ్చింది.
2018 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ఆఖరి సినిమా తెర మీదకు వస్తుందని, ఆ తర్వాత ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి 2019 ఎన్నికల అంశంలో బిజీ అవుతారని వార్తలు వస్తున్నాయని ప్రచారం సాగుతోంది. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల వైపు పూర్తిగా దృష్టి సారించనున్నారని తెలుస్తోందని అంటున్నారు.
జనసేన పార్టీని క్షేత్రస్థాయికి తీసుకు వెళ్లేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాణ రంగంలో కూడా భాగస్వామ్యం వహించి రాబోయే రెండు మూడేళ్లలో దాదాపు రూ.100 కోట్లు సంపాదించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇటీవల ఓ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన వద్ద ఇప్పుడు డబ్బు లేదని చెప్పారు. 2019 ఎన్నికలలో పోటీ చేసే విషయమై చూస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల కోసం సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతారని తాజాగా ప్రచారం సాగడం గమనార్హం.