జగన్ తో మాట్లాడాకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం .. కేసుల నుండి రక్షించుకునే బేరం : మాజీ ఎంపీ సబ్బం హరి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి . విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఖచ్చితంగా ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోమారు స్పష్టం చేయడంతో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. తాజాగా నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటనతో ప్రతిపక్ష పార్టీలు అధికార వైసీపీపై మండిపడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డి అవాస్తవాలు మాట్లాడటం అలవాటు అయిందని మాజీ ఎంపీ సబ్బం హరి మండిపడ్డారు.
ప్రైవేటీకరణకు జరిగిన ఒప్పందంలో వైసీపీ నేతలు భాగస్వాములు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జరిగిన ఒప్పందంలో వైసీపీ నేతలు భాగస్వాములైన విషయం అందరికీ తెలుసు అని సబ్బం హరి ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా తమను కేసుల నుండి రక్షించుకోవడం కోసమే కేంద్రంతో బేరమాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేకుండా చేస్తున్నారని సబ్బంహరి ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలను మభ్య పెట్టాలని చూడటం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు సబ్బంహరి.
జగన్ తో మాట్లాడాకే ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు
జగన్ తో ప్రతి విషయం మాట్లాడిన తర్వాతే ప్రైవేటీకరణ పై కేంద్రం ముందుకు వెళుతుందని, ఆ విషయాన్ని నిర్మలాసీతారామన్ స్వయంగా చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిస్తుంటే అడ్డుకుంటున్నది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్న సబ్బం హరి పోస్కో రావడం కోసమే పోలీసులచే ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసిపి సర్కారుపై మండిపడ్డారు.
ప్రైవేటీకరణ అడ్డుకోవటం కోసం జగన్ ముందుండి ఉద్యమాన్ని నడిపించాలి
వైసిపి ఎంపీలు రాజీనామాలు చేస్తే మిగతా అన్ని పార్టీల నుండి నాయకులు ముందుకు వస్తారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఒప్పుకున్న తరువాతనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని పేర్కొన్నారు సబ్బం హరి. ఇక ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం సీఎం జగన్ ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించడం ఒక సీఎం జగన్ వల్లనే సాధ్యమవుతుందని సబ్బం హరి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుపై చంద్రబాబు పోరాటం చేయాలని పేర్కొన్నారు.
బీజేపీ, పవన్ కళ్యాణ్ లు విశాఖ ఉక్కు పై తమ స్టాండ్ చెప్పాలి
అంతేకాదు బీజేపీ, పవన్ కళ్యాణ్ లు విశాఖ ఉక్కు పై తమ స్టాండ్ ను స్పష్టం చేయాలని సబ్బంహరి డిమాండ్ చేశారు . పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తావ్ అసలు నీ స్టాండ్ ఏంటి అని ప్రశ్నించిన సబ్బంహరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ కోసం పవన్ కళ్యాణ్ జాతీయ బిజెపి నాయకులను కలవడానికి మరోమారు ఢిల్లీకి వెళ్లాలని సూచించారు సబ్బం హరి.