ఊళ్లో ఉండరు: జగన్ గొడవపై సబ్బం, నామా ఫైర్
విశాఖపట్నం/ హైదరాబాద్: తన ఇంటిని ముట్టడించాలనే ఆలోచనను విరమించుకోకపోతే ఊరు వదిలి పోవాల్సి వస్తుందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనుచరులను హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు కాదన్నంత మాత్రాన తాను ఖాళీగా కూర్చుకోవడానికి రాజకీయ సన్యాసం తీసుకోలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రెండు నెలల తర్వాత తాను ఎదో ఓ పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు. జగన్ పార్టీవాళ్లు ఇంతటితో ఆందోళనలు ఆపితే మంచిదని ఆయన అన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలూ చేయవద్దని తాను అనుచరులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మేకపాటి రాజమోహన్ వ్యాఖ్యలపై సబ్బం హరి తీవ్రంగా ప్రతిస్పందించారు.

కాగా, సబ్బం హరిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖపట్నంలో ఆందోళనలు జరిగాయి. సబ్బం హరి అనుచరులు ర్యాలీలు నిర్వహించారు. వైయస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
వైయస్ జగన్పై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అవినీతి చరిత్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. జగన్ మీడియా అవినీతి పునాదులపై పుట్టుకొచ్చిందని ఆయన అన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications