లేదంటే మరో మార్గంలో సభకు: టిపై సబ్బం హెచ్చరిక
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను అడ్డుకునేందుకు తాము లోకసభలోకి మరో మార్గంలో ప్రవేశిస్తామని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి హెచ్చరించారు. మరో మూడు రోజుల్లో తాము తిరిగి లోకసభలో అడుగు పెడతామన్నారు. బిల్లుపై బుధవారం లోకసభలో చర్చ జరగనున్నందున సస్పెన్షన్లకు గురైన సభ్యులను అనుమతించాలని విపక్షాలు కోరుతాయన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే వేరే మార్గంలో వెళ్తామన్నారు.
అందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నారు. పార్లమెంట్లో బిల్లును అడ్డుకుని తీరుతామన్నారు. సస్పెన్షన్కు గురైన సీమాంధ్ర ఎంపీలంతా రెండు రోజుల్లో తిరిగి లోక్సభ సమావేశాలకు హాజరవుతారని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీలు లేకుండా దానిపై ఎవరితో చర్చిస్తారన్న అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందని, బిల్లుపై చర్చ జరగాలంటే తప్పకుండా తమను అనుమతించాల్సిందేనని సబ్బం పేర్కొన్నారు.
సభలోకి వెళ్లి బిల్లును అడ్డుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తామని చెప్పారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఆత్మరక్షణ కోసమే పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే వాడారని, దాని వినియోగం తప్పు కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం పంతానికి పోవడంవల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మీరా కుమార్, కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండేలు సిగ్గుపడాలన్నారు.
సోనియా నియంతలా వ్యవహరిస్తుంటే అంతా ఆమెకు సేవకుల్లా పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేసినప్పుడు తాము అడ్డుపడలేదని, కాదని నిరూపిస్తే మోకాళ్లపై కూర్చొని వారికి క్షమాపణలు చెబుతామన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగానే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని హరి చెప్పారు. తాను 21వ తేదీ వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తానని, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతానని పేర్కొన్నారు.