బోట్ షికారు చేసిన టెండూల్కర్: కండ్రిగనే ఎందుకు..?
హైదరాబాద్: క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ భారత దేశంలో ఎన్నో గ్రామాలు ఉండగా.. నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామం "పుట్టంరాజు వారి కండ్రిగ" అనే ఊరిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. దేశం మొత్తం సచిన్ ప్రత్యేకించి ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
అందుకు కారణం.. సుమారుగా రెండు నెలల క్రితం నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖా వాణి విదేశాల నుంచి వస్తుండగా విమానంలో క్రికెట్ దేవుడు కనిపించాడు. ఆమె సచిన్ వద్దకు వెళ్లి తనన్ని తాను పరిచయం చేసుకుని తమ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చెప్పి ఎంపీ హోదాలో కొన్ని నిధులను అందించాలని కోరింది.
ఇంకో అడుగు ముందుకేసి తమ జిల్లాలోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరింది. జయ ప్రకాశ్ నారాయణన్ పుట్టిన రోజు సందర్బంగా ప్రధాని మోడీ ఆదర్శ సంసద్ గ్రామ్ యోజన పేరిట ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చిన విషయాన్ని సచిన్కు గుర్తు చేశారు.
దాంతో సచిన్ కూడా తన మదిలో ఆ ఆలోచన ఉందని చెప్పాడు. అప్పుడే ఆమె "పుట్టంరాజు వారి కండ్రిగ" గురించి చెప్పి ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా సూచించారు. విమానం దిగిన వెంటనే రేఖా వాణి చెప్పిన "పుట్టంరాజు వారి కండ్రిగ" గురించి ఆలోచించిన సచిన్ కొన్ని రోజులకి ప్రధాని మోడీని కలిసి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న విషయాన్ని తెలియజేశాడు. ఇది "పుట్టంరాజు వారి కండ్రిగ"ను దత్తత తీసుకోవడానికి అసలు కారణం.

దీనికి ప్రధాని మోడీ.. సచిన్కు తన అభినందలను ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని కృష్టపట్నం పోర్టుకి చేరుకున్నారు. ముంబై నుంచి చెన్నైకి విమానంలో చేరుకున్న సచిన్... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు.
విద్యార్ధులు, ప్రజలు సచిన్కు ఘన స్వాగతం పలికారు. కృష్టపట్నం పోర్టుకు చేరుకున్న సచిన్ పోర్టులో ఉన్న ఓడలను కాసేపు కలియతిరిగి చూశారు. కాసేపు ఆయన బోట్ షికారు చేశారు. సచిన్ రాకతో కృష్ణపట్నం పోర్టులో భారీగా భద్రతను కట్టదిట్టం చేశారు. సచిన్ గౌరవార్ధం ఈరోజు విందు ఏర్పాటు చేశారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ ద్వారా పుట్టంరాజు వారి కండ్రిగకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, కామినేని శ్రీనివాస్ జిల్లా ప్రతినిధులు పాల్గొంటారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ ఊర్లోనే సచిన్ గడపనున్నారు. చివరి పది నిమిషాలు గ్రామస్థులతో ఫోటోలు దిగనున్నారు. కేవలం గ్రామస్థులు మాత్రమే ఆయనను కలవాలని, సందర్శకులు, అభిమానులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన 30 మంది విద్యార్ధులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వారితో సచిన్ క్రికెట్ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ గ్రామాన్ని రూ. 3.50 కోట్ల నిధులతో అభివృద్ది చేయనున్నట్లు సచిన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అదివారం పర్యటించనున్న సచిన్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ది పనులను సమీక్షిస్తారు. తొలుత పుట్టంరాజు వారి కండ్రిగలో ఫైలాన్, శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. తర్వాత వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన ఇంటిని, సామూహిక చెత్త వేసే ప్రదేశాన్ని, స్వయం సహాయక సంఘాలు, నిమ్మసాగు రైతులు, గ్రామంలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై గ్రామస్ధులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసిన పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామ ప్రజలు సచిన్కు వెలకట్టలేని అనుభూతి మిగిల్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్న సచిన్కు తమ గ్రామంలో పొగతాగమని, మద్యపానం చేయమని ప్రమాణం చేయనున్నారు. యాదవులు అత్యధికంగా గల పుట్టంరాజువారి కండ్రిగలో గొర్రెల పెంపకం గురించి సచిన్ టెండూల్కర్ తెలుసుకోనున్నారు.












Click it and Unblock the Notifications