అమరావతి స్వాధీనం.. కొల్లగొడతానని మాట్లాడుతారా: పవన్ కళ్యాణ్పై యామిని నిప్పులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మంగళవారం నిప్పులు చెరిగారు. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ ఇప్పుడేమంటారు?
మేడిన్ జర్మనీ, మేడిన్ జపాన్ తరహాలో ఇకపై మేడిన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం రానుందని, అందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని యామిని అన్నారు. అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని ప్రశంసలు కురిపించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రా వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆంధ్రా వాళ్లు కర్రీ పాయింట్లు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతారో చెప్పాలన్నారు.

జగన్ ఏం చేశారు?
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి కారణంగా రాయలసీమ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని యామిని చెప్పారు. వైయస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి చెందిన కడప జిల్లాలో పుట్టారని, కానీ ఆయన సీమకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అసలు రాయలసీమకు ఏం చేస్తానో కూడా ఆయన చెప్పలేదన్నారు.

స్వాధీనం.. కొల్లగొడతానని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా యామిని నిప్పులు చెరిగారు. రాజధాని అమరావతిని స్వాధీనం చేసుకుంటామని, సహజ వనరులు కొల్లగొడుతున్నారని మరో నేత ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని జనసేనానిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంతా కేంద్రానిదేనని చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గోడలకు కన్నాలు, సున్నాలు వేసుకునే నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మేడిన్ ఇండియా అని మోడీ తిరిగిన దేశాలెన్ని? ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications