చంద్రబాబు.. పవన్ ను సీఎం చేస్తారా - ఇప్పటికే పొత్తులో ఉన్నారు : జనాలను చులకన చేస్తున్నారు - సజ్జల..!!
త్యాగాలకు సిద్దం అని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు...పవన్ కళ్యాన్ ను సీఎం చేస్తారా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. మొత్తం చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటున్నారని..తాను సీఎం అవుతానని చెబుతున్నారన్నారు. రాజకీయాల్లో పొత్తులు ఉంటాయని..అయితే అవి భావ సారుప్యత..ప్రజల అజెండా మీద ఏకాభిప్రాయం.. సిద్దాంతాలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఎవరు ఎవరిని సీఎం చేస్తారు...
నాడు వైఎస్సార్ పొత్తులు వ్యతిరేకించినా.. జాతీయ పార్టీ నాయకత్వం ఆదేశం మేరకు నడుచుకోవాల్సి వచ్చిందని సజ్జల వివరించారు. చంద్రబాబు అవకాశం మేరకు ఎప్పటికప్పుడు చేసిన జంప్ లు అందిరికీ తెలిసనవేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్టు - డైరెక్షన్ మేరకే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. చంద్రబాబు త్యాగం చేసి పవన్ ను సీఎం చేస్తారా.. పవన్ టీడీపీ అధినేతను సీఎం చేసేందుకు పని చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉండటానికి అవకాశం ఉండదని గుర్తు చేసారు. 2014 ఎన్నికల్లో ఇదే రకంగా పవన్ నాడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని..ఆ ప్రభుత్వంలో ఏం చేయలేదనే కారణంతో టీడీపీ పైన ఫైర్ అయ్యారని గుర్తు చేసారు.

మోదీని దూషించారు.. మళ్లి కలిసారు.. మరోసారి
2019 ఎన్నికల్లో నాడు టీడీపీకి మేలు చేసేందుకు...ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేసారు. టీడీపీని ఆక్రమించిన చంద్రబాబు అప్పటి నుంచి ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొనే ముందుకు వెళ్తున్నారని చెప్పారు. 2014 ఎన్నికల ముందు మోదీని నరహంతకుడంటూ విమర్శించిన చంద్రబాబు..ఆ ఎన్నికల సమయంలో మోదీనికి ప్రశంసిస్తూ...ఆయనతో చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. ఆ తరువాత 2019 ఎన్నికలు అవుతూనే మోదీకి వ్యతిరేకంగా మారారని విమర్శించారు. ఇక, బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి సహకరించారని ఆరోపించారు.

రెండేళ్లలో ఎన్నికలు..జగన్ లక్ష్యం స్పష్టం
పవన్ కళ్యాణ్ ఒక టూరు - నాలుగు డైలాగులతో రాజకీయం చేద్దామనుకుంటున్నారని ఎద్దేవా చేసారు. ఇద్దరు వేర్వేరుగా ఉన్నట్లుగా ప్రజలను నమ్మిస్తూ...వారిని చులకనగా చూస్తున్నారని..ఇద్దరు కలిసే సహజీవనం చేస్తున్నారంటూ సజ్జల ఆరోపించారు. ఎవరు ఏ రకంగా ప్రయాణం చేసినా.. ప్రజలకు తాము చేయగలిగింది చెప్పటం.. దానిని చేయటమే జగన్ లక్ష్యమని సజ్జల స్పష్టం చేసారు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయని..ఇప్పటి నుంచే తమ మైత్రి గురించి ప్రజల మనస్సుల్లో నాటటం కోసం ఈ ప్రయత్నాలు ప్రారంభించారంటూ సజ్జల వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications