జగన్ అందుకు సిద్దంగా లేరు - సజ్జల...!!
ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. సీఎం జగన్ ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచార జోరు పెంచారు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ప్రచార సభల్లో పాల్గొన్నారు.చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాను చేయగలిగంది మాత్రమే చెబుతానని జగన్ స్పష్టం చేసారు. ఈ సమయంలో మేనిఫెస్టో, హామీల పై వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.
తమ మేనిఫెస్టోలో ప్రజలు ఏం చేస్తామో అదే చెప్పామని సజ్జల పేర్కొన్నారు. తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకొనే ఆలోచనలు తమకు ఉండవని చెప్పారు. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ కోరుతున్నారని గుర్తు చేసారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అనగలరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎందుకు ఆ విధంగా అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎన్నో కుటుంబాల్లో మేలు జరిగిందని వివరించారు. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కవ పథకాలు ఎలా ఇస్తామని చెబుతున్నారని సజ్జల ప్రశ్నించారు.

అమలు చేయాలనే చిత్తశుద్ది ఉన్నవారెవరూ అడ్డగోలుగా హామీలు ఇవ్వరని పేర్కొన్నారు. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. చంద్రబాబు ఇప్పటికే చెప్పిన పథకాల మొత్తం రూ 1.50 లక్షల కోట్లుకు చేరిందని వివరించారు. జగన్ బాధ్యత కలిగిన నాయకుడిగా మేనిఫెస్టో ప్రకటించారని.. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామాలు ఇవ్వమని కొంత మంది తమతో అన్నారని చెప్పారు. కానీ, జగన్ అందుకు సిద్దంగా లేరన్నారు. చేయలేని పని జగన్ చెప్పరని సజ్జల వివరించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే వ్యవస్థలు అన్నీ పతనం అవుతాయని సజ్జల వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో ఎక్కడ ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరని..కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమని సజ్జల చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications