పవన్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చెయ్యాలి; చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి : సజ్జల సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సజ్జల రామకృష్ణా రెడ్డి హితవు పలికారు. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ఈ ఎన్నికల ఓటమితో అయినా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సజ్జల రామకృష్ణా రెడ్డి హితవు పలికారు.

జగన్ ను ప్రజలు విశ్వసిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల్లో 98 శాతానికి పైగా స్థానాలలో వైసిపి గెలుపొందింది అని పేర్కొన్న ఆయన భారతదేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సంక్షేమ పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని, జగన్ పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే ఎన్నికలలో జగన్ పార్టీ వైపు నిలుస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను, టిడిపి తప్పుడు విమర్శలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని సజ్జల అభిప్రాయపడ్డారు.

మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎంపిక.. వైసీపీలో గొడవలపై సజ్జల
చంద్రబాబు కుప్పం లోనే బోర్లా పడ్డారని ,ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎంపిక ప్రక్రియ పై మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత భారీ విజయం సాధించినప్పుడు నాయకత్వం కోసం పోటీ సహజంగా జరిగేదేనని అయితే వైసీపీ మాత్రం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తోందని, ఇతర పార్టీలతో పోలిస్తే తమ పార్టీలో భేదాభిప్రాయాలు చాలా తక్కువగా ఉన్నాయని సజ్జల చెప్పారు.

పవన్ కు చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ పని చెయ్యాలన్న సజ్జల
ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారని, ఏదైనా జరిగితే తాను వస్తానని హడావుడి చేస్తున్నారని, ఇదంతా దేనికి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు అంతా బాగానే ఉన్నారని, పవన్ అనవసరపు హడావిడి చేస్తున్నారన్నారు. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే మిత్రపక్షమైన బీజేపీని ఒప్పించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ జరుగకుండా చూడాలని సవాల్ విసిరారు.

ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన జట్టు కట్టటంపై సజ్జల
ఎంపీపీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఒక్కటయ్యాయని, వైసిపి గెలవకుండా ఆ రెండు పార్టీలు జత కట్టాయని పేర్కొన్నారు. టిడిపి, జనసేన స్నేహంపై ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ మిత్ర పక్షం అంటూనే టీడీపీ తో జట్టు కట్టిందని జనసేనపై విమర్శలు చేశారు . ఇక ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ వైసిపి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్
నిన్నటికి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిషత్తు ఎన్నికల తీర్పుపై మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన విజయ ప్రస్థానం బిందువులా మొదలై సింధువులా దినదినాభివృద్ధి చెందుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైసిపి దౌర్భాగ్యపు, దిక్కుమాలిన పాలన కొనసాగిస్తోందని, ఇలాంటి పాలన మన దేశంలో వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు. వైసిపి దాష్టీక పాలనను ఎదుర్కోవడానికి క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించామన్నారు పవన్ కళ్యాణ్ .

వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడతామని స్పష్టం
సెప్టెంబర్ 27, 28 తేదీలలో విజయవాడలో నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో వైసీపీ పాలన పై పోరుబాట పడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ బారినుండి కాపాడుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దాడులు బెదిరింపులతో విధ్వంసం సృష్టిస్తున్నారు అని ఇతర పార్టీల అభ్యర్థుల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications