కర్నాటకలో వైసీపీ పోటీపై సజ్జల క్లారిటీ- తెలంగాణను అందుకే వదిలేశాం-బీఆర్ఎస్ కు మద్దతు ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కొత్త కొత్త ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఇందులో కర్నాటకలోని ఆంధ్రా సరిహద్దు సీట్లలో వైసీపీ పోటీకి సంబంధించిన అంశం ఒకటి. అలాగే తెలంగాణలోనూ మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో వైసీపీ అడుగుపెట్టే అవకాశాలున్నాయంటూ మరో ప్రచారం కూడా జరుగుతోంది. వీటిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్న కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతిచ్చే విషయంపైనా సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇతర రాష్ట్రాల్లో వైసీపీ పోటీపై సజ్జల క్లారిటీ
ఏపీలో బలమైన అధికారపక్షంగా ఉన్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయంటూ ఈ మధ్య ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన గాలి జనార్ధన్ రెడ్డి సాయంతో కర్నాటక సరిహద్దు జిల్లాల్లో వైసీపీ పోటీ చేయొచ్చనే వాదన వినిపిస్తోంది. దీంతో కర్నాటకలో ఏ పార్టీతో కలిసి వైసీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతోందనే చర్చ కూడా సాగింది. దీనిపై ఇవాళ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.

కర్నాటకలో పోటీ చేయట్లేదన్న సజ్జల
కర్ణాటకలో వైసీపీ పోటీ చేసే అంశంపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మిగతా రాష్ట్రాల్లోనూ వైసీపీ పోటీపై తేల్చేశారు. కర్ణాటకలో పోటీ చేసే ఆలోచన లేదని సజ్జల స్పష్టం చేశారు. అలా అనుకుంటే తమిళనాడు లో కూడా పోటీ చేయవచ్చన్నారు. తెలంగాణ వద్దనుకుని ఏపీపై పూర్తి దృష్టి పెట్టామని, వైసీపీ ఏపీ ప్రజలకు అంకితమైన పార్టీ అని సజ్జల క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి,సంక్షేమం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఎవరొకరి చంక ఎక్కి గెలవాలి అనుకునే ఆలోచన లేదని సజ్జల తేల్చిచెప్పారు.
ముందు ఏపీ ప్రయోజనాలు పూర్తి చేసిన తర్వాత వేరే ఆలోచన చేస్తామన్నారు.

బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు ?
కేసీఆర్ కొత్తగా పెట్టిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు ఏపీలో వైసీపీ మద్దతు ఇచ్చే విషయంపైనా సజ్జల ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ పై తమ అభిప్రాయం తమకుందని సజ్జల తెలిపారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఆలోచిస్తామన్నారు. దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైసీపీకి లేదన్నారు.ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనన్నారు.
కేసీఆర్ కోరితే దీనిపై పార్టీలో చర్చించి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పటివరకూ అలాంటి ప్రతిపాదనేదీ రాలేదన్నారు. తద్వారా భవిష్యత్తులో కేసీఆర్ మద్దతు కోరితే వైసీపీ మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది జగన్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయిస్తారని సజ్జల సంకేతాలు ఇచ్చేశారు. ఎందుకంటే ఏపీలో మిగతా పార్టీలతో పోలిస్తే కేసీఆర్, ఆయన పార్టీ జగన్ కే దగ్గర కావడమే ఇందుకు నిదర్శనం.












Click it and Unblock the Notifications