బాబుది మీడియా యుద్ధం-జగన్ కు ఆయనకు తేడా ఇదే-సజ్జల కీలక వ్యాఖ్యలు
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు నిత్యం ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారం పోవడంతో పాటు, రాష్ట్ర ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించి రిజెక్ట్ చేయడంతో... ఇక మళ్లీ అధికారంలోకి రాలేమనే స్పష్టమైన వైఖరి కనిపించడంతో తెలుగుదేశం పార్టీ నిరాశ, నిస్పృహతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద అడ్డగోలుగా కుట్రలు, కుతంత్రాలతో కూడిన మారీచ, మాయా యుద్ధం చేస్తోందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ పాలనలో ఉన్న ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ విధానాల మీద గత మూడేళ్లుగా విషం చిమ్ముతూనే వస్తోందన్నారు.
టీడీపీ చేస్తున్న కుట్రలను, వాస్తవాలను ప్రజలకు మేము చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని సజ్జల తెలిపారు. ప్రతిపక్షంలో ఉండటం అంటే ఎవరికైనా అదే ముగింపు కాదన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో అది సహజం. అందుకోసం అనుసరించాల్సిన సంప్రదాయ పద్ధతులు ఉన్నాయని తెలిపారు. ఓటరు దేవుడు చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్ , టీడీపీ, వైయస్సార్ సీపీ తలరాతను నిర్ణయిస్తాడని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటరుకు అప్పీలు చేసేవిధంగా ఎన్ని పోరాటలు అయినా చేయవచ్చని, అధికారంలో ఉండి ఉంటే వారి హయాంలో చేసిన మంచి చెప్పవచ్చని, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపవచ్చని సజ్జల తెలిపారు. అవి ప్రభుత్వ విధానాలు, నైతిక ప్రవర్తన, ప్రభుత్వ పనితీరు, పారదర్శకత, అవినీతి అన్నీ సబ్జెక్ట్లు అవుతాయన్నారు. ఏవైతే వాస్తవాలు కావో వాటినే తీసుకువచ్చి, ఒక కుట్ర ప్రకారం టీడీపీ ప్రచారం చేయడమే దుర్మార్గమవ్నారు.
టీడీపీ వాళ్లు మాట్లాడేదానిలో ఆధారాలు ఉండవు. అన్నీ అభూతకల్పనలు, అవాస్తవాలని సజ్జల ఆరోపించారు. వాటిని ఒకటికి వందసార్లు, రెండు వందల సార్లు చెప్పుకుంటూ వెళతారన్నారు. అవే నిజాలు అనేలా ప్రచారం చేసే ప్రయత్నాల్లో టీడీపీ వాళ్లు రెండు విషయాలు విస్మరిస్తున్నారన్నారు. ఇందులో రాజకీయ పార్టీగా చేయాల్సిన పద్ధతుల విషయంలో పూర్తిగా టీడీపీ డీవియేట్ అయిందని, రాష్ట్ర ప్రజలను, ఓటర్లను కేవలం తప్పుదోవ పట్టించడం ద్వారా, ఎన్నికల్లో తమకు అనుకూలంగా తీర్పును తెప్పించుకోవచ్చనే భ్రమలో ఆ పార్టీ కొట్టుకుంటోందన్నారు. గత కొంతకాలంగా టీడీపీ వాళ్ల ఆరోపణలు చూస్తే ఎవరికైనా ఇదే అర్థం అవుతోందన్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, దాన్ని నిలుపుకునేందుకు చంద్రబాబు నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజలకు చేయాల్సిన వాటిలో వంద శాతం కాకపోయినా, కనీసం పదిశాతం పనులు చేసి మళ్లీ తీర్పు కోరతారేమో అనుకున్నామని సజ్జల తెలిపారు. ఇచ్చిన హామీలు అన్నీ తుంగలోకి తొక్కి తాను మారని చంద్రబాబు నాయుడేనని మరోసారి రుజువు చేసుకున్నారని విమర్శించారు. రైతులకు లక్షకోట్ల రుణమాఫీ చేస్తానని ఎప్పటిలానే రైతులను మోసం చేశాడన్నారు. చచ్చీచెడీ అయిదేళ్లలో 14వేల కోట్లు చెల్లించారని, మిగిలిన 600 హామీలను తుంగలోకి తొక్కేశారన్నారు. చేసిన అప్పులతో పాటు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు రూ.4లక్షల కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళ్లిపోయాడని, ప్రజల పట్ల బాధ్యత లేదని అర్ధం అవుతోందని సజ్జల విమర్శించారు.
జగన్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 95శాతం పైగా అమలు చేయడంతో, తన నిబద్ధతను నిరూపించుకున్నారని సజ్జల గుర్తుచేశారు. చంద్రబాబు గతంలో తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ప్రకటించడం, భవిష్యత్లో అలా ఉండనని చెప్పడం, ఇంతకన్నా భిన్నంగా ఉంటామని చెప్పడం మానేసి ఈ మూడేళ్లలో తిట్లు, బూతు పురాణాలతో కాలం గడుపుతున్నారన్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా రెండేళ్లు సమయం ఉందని,దాంతో పిచ్చి పీక్స్కి వెళ్లిపోయి చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు రోజుకు ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ... ఎక్కడో మొదలుపెట్టి దాన్ని ఎక్కడికో ముడి పెడుతున్నారన్నారు. ఆధారాలతో సహా వస్తారా.. అంటే అదీ లేదన్నారు.
సీఆర్డీయే మీద అలాగే రాద్ధాంతం చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు టీడీపీకి ముద్దుగా అనిపిస్తాయన్నారు. తమ ప్రభుత్వం అక్కడ రాజధానితో సంబంధం లేకుండా అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా, లేఅవుట్లను డెవలప్ చేయడానికి వనరులను సమకూర్చుకునేందుకు అదే పనిచేయబోతే వెంటనే, అక్కడేదో ఘోరాలు జరిగిపోతున్నట్లు, మోసం జరుగుతున్నట్లు రంకెలు వేయడం టీడీపీ అండ్ కో కు పరిపాటిగా మారిందని సజ్జల విమర్శించారు. అమరావతిలో సీఆర్డీఏ ఎకరా 10 కోట్లకు ఎలా అమ్ముతుందని అంటారన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి సంబంధించి, బాబు ఇచ్చిన జీవోను ఆధారం చేసుకునే సీఆర్డీఏ ముందుకు వెళితే హాహాకారాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే.. ఆరోజు మార్టిగేజ్ ముద్దు అయింది. ఈరోజు లే అవుట్లను అభివృద్ధి చేస్తుంటే.. ఇల్లు ఎక్కి గట్టి గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తున్నారని సజ్జల విమర్శించారు.
మద్యానికి సంబంధించి చంద్రబాబు తలకాయలో ఉన్న విషాన్ని అంతా కుమ్మరించారని సజ్జల ఆరోపించారు. మీకు అండగా ఉండే మీడియా దానికి ఆద్యం పోస్తోందన్నారు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. చంద్రబాబు, టీడీపీ ప్రాణం ఎల్లో మీడియాలో ఉందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 వాళ్లే అజెండాను ఫిక్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. డిస్టలరీల కెపాసిటీ పెంచుతూ అనుమతులు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనన్నారు. కొత్తగా ఒక్క డిస్టలరీ కూడా జగన్ అధికారంలోకి వచ్చాక రాలేదన్నారు. అయినా సరే ఏపీలో మద్యంలో విషం తయారు అవుతుందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారని తెలిపారు