టీడీపీ నుంచి చంద్రబాబు బహిష్కరణ - 1995 నాటి లేఖలో ఎన్టీఆర్ - సంచైత సంచలన ట్వీట్
వెన్నుపోటు.. ఈ పేరు చెబితేనే గుర్తొచ్చే పేరు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. తొలిసారి నాదెండ్ల భాస్కర్ రావు చేతిలో, ఆ తర్వాత అల్లుడు చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఆయన అనూహ్యరీతిలో పదవిని, పార్టీపై పట్టును కోల్పోయారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆదివారం అన్ని పార్టీల మధ్య దీనిపై వాగ్వాదాలు నడిచాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ, బీజేపీ నేత, మన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచైత గజపతిరాజు ఓ సంచలన ట్వీట్ చేశారు.
Recommended Video
చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు - ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తేస్తారా? - విజయసాయిరెడ్డి -అప్పుడేమైందంటే
బాబు సహా ఐదుగురిపై..
ఎన్టీఆర్ పదవిని, ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రాణాలనూ కోల్పోవడానికి దారితీసిన 1995 ఆగస్టు సంక్షోభం నాటి కీలక లేఖ ఒకదానిని సంచైత బయటపెట్టారు. టీడీపీ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత హోదాలో ఎన్టీఆర్.. అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడుకు 1994, ఆగస్టు 25న ఓ లేఖ రాశారు. ‘‘టీడీపీ నుంచి చంద్రబాబు, అశోక్ గజపతి, విద్యాధర్ రావు, దేవేందర్ గౌడ్, మాధవరెడ్డిలను బహిష్కరించాం. దానికి అనుగుణంగా ఈ ఐదుగురి శాసన సభ్యత్వాలను కూడా తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాం''అని లేఖలో ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే నిజానికి..
ఆ లేఖకు ముందే అంతా..
చంద్రబాబు సహా ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ, శాసనసభ్యత్వాలు కూడా రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ ఆగస్టు 25న స్పీకర్ కు లేఖ రాశారు. కానీ దానికి ఒక రోజు ముందే.. పార్టీని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు. బాబు సారధ్యంలోని టీడీపీ.. 1995, ఆగస్టు 24న ఎన్టీఆర్ పై సస్పెన్ వేటువేసి, బాబునే టీడీఎల్పీ నేతగా ఎన్నుకుంది. దీంతో ఎన్టీఆర్ లేఖకు ప్రాధాన్యం లేకుండాపోయింది. అనంతరం వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన ఘటనల్లో.. ఆగస్టు 27న ఎన్టీఆర్ పై చెప్పుల దాడి జరిగింది. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత ఎన్టీఆర్ కన్నుమూశారు.
జగన్ వెన్నుపోటుకు 9 ఏళ్లు - రొమ్ము గుద్దే రకమన్న వెంకన్న - విజయసాయిరెడ్డికి దిమ్మతిరిగేలా..
విజయసాయికి సమర్థన..
ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనకు 25 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆదివారం పలు కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు అవమానించిన తీరును నిజమైన పార్టీకార్యకర్తలెవరూ మరిచిపోలేరని, మామను అతి దారుణంగా అంతం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్టీఆర్ వారసరత్వం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ఈ కామెంట్లను మన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచైత గజపతిరాజు సమర్థిస్తూ బాబుపై, తన బాబాయిపై విమర్శలు గుప్పించారు.
బాబు, బాబాయిపై సంచైత ఫైర్
‘‘అధికారదాహంతో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, అశోక్ గజపతిరాజు తిరిగి ఎన్టీఆర్ వారసులమని చెప్పుకుంటారు. అదే సమయంలో మహిళలకు ఎన్టీఆర్ ఇచ్చిన చట్టబద్ధ హక్కులను వాళ్లు మరిచిపోతారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానానికి తొలి మహిళా ఛైర్పర్సన్ అయిన నాపై తప్పుడు సమాచారాన్ని, అబద్ధాలను ప్రచారంచేస్తారు''అని సంచైత ఫైరయ్యారు. మన్సాస్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల్ని తప్పు పట్టిన సంచైత.. క్షమాపణ చెప్పాలంటూ ఇచ్చిన గడువుపై చంద్రబాబు స్పందించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.