మూడు వారాలుగా బెంగళూరులో లక్ష్మి: పోలీసులు ఇలా పట్టుకున్నారు...
బెంగళూరు: సెల్ఫోన్లపై నిఘా పెట్టి పోలీసులు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలు లక్ష్మిని పోలీసులు పట్టుకోగలిగారు. లక్ష్మి కోసం ఒంగోలు, చెన్నై, పాండిచ్చేరి, షోలాపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పోలీసు ప్రత్యేక బృందాలు గాలించాయి. పాండిచ్చేరిలో చదువుతున్న కుమారుడితో పాటు కూతురు, అల్లుణి పిలిపించి పోలీసు అధికారులు మాట్లాడారు.
కాగా, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గుంటూరు కోర్టులో లక్ష్మి తరఫున పిటిషన్ దాఖలైంది. అయితే, దాన్ని కోర్టు తోసిపుచ్చింది. లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లడానికి సహకరించిన గుంటూరువాసి తేళ్ల హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆమె భర్త స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువుల సెల్ఫోన్లపై నిఘా పెట్టారు.
ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి అతని బంధువులు, స్నేహితులకు ఓ నంబర్ నుంచి ఫోన్లు వచ్చినట్లు గుర్తించారు. దాన్ని ఆధారం చేసుకొని సోమవారం ఉదయం హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు కర్ణాటక డీజీపీ ఓం ప్రకాశ్కు ఆ సమాచారం ఇచ్చారు.
అక్కడి బంధువుల ఇంట్లో తలదాచుకున్న ప్రొఫెసర్ లక్ష్మి, భర్తను, ఆశ్రయం ఇచ్చిన బంధువు కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మెడికల్ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలు, జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి చిట్టచివరికి పోలీసులకు చిక్కింది. మూడు వారాలుగా పరారీలో ఉన్న ఆమెను సోమవారం బెంగళూరులో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకొంది.
మూడు వారులుగా ఆమె బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె భర్త విజయసారథిని కూడా అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆమె వాగ్వాదం చేసినట్టు సమాచారం. వైవాహిక సమస్యల కారణంగానే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకొన్నదని వాదించినట్టు తెలుస్తోంది.
భర్తను ఆశ్రయమిచ్చిన బంధువుతో కలిపి ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలసంధ్యారాణి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సంధ్యారాణి ఆత్మహత్యను తట్టుకోలేక మిర్యాలగూడలో ఉంటున్న సంధ్యారాణి భర్త రవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. లక్ష్మిని అరెస్టు చేయాలంటూ విద్యార్థులు పెద్ద యెత్తున ఆందోళనకు దిగారు.