లక్ష్మి దంపతులను ఎటిఎం పట్టిచ్చింది : ఎలా ట్రాక్ చేశారు?
గుంటూరు: వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి మృతి కేసులో నిందితులు ప్రొఫెసర్ లక్ష్మిని, ఆమె భర్త విజయసారథిని పోలీసులు గుంటూరులోని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. వారిద్దరిని పోలీసులు బెంగళూరులోని వారి స్నేహితుడి ఇంట్లో అరెస్టు చేసి సోమవారం గుంటూరు తరలించిన విషయం తెలిసిందే.
మూడు వారాలుగా బెంగళూరులో లక్ష్మి: పోలీసులు ఇలా పట్టుకున్నారు...
ప్రొఫెసర్ లక్ష్మి దంపతులు బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచార అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం మంగళవారం దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుంది. పోలీసులకు చిక్కకుండా వారు గత 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలను చుట్టేసినట్లు చెబుతున్నారు.
బెంగళూరులోని జయనగర్ ఎటిఎం ద్వారా ప్రొఫెసర్ లక్ష్మి దంపతుల ఖాతా నుంచి వారి మిత్రుడు డబ్బులు డ్రా చేయడం వల్ల వారు పట్టుబడినట్లు తెలుస్తోంది. కేసు నమోదైన తర్వాత లక్ష్మి దంపతులు దేశంలోని 16 ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.
తమ కుమారుడు చదువుతున్న పాండిచ్చేరి చేరుకుని ఓ లాడ్జీలో వారు బస చేసినట్లు వారు గుర్తించారు. ఆ తర్వాత తిరుపతి, చెన్నై చేరుకున్నట్లు చెబుతున్నారు. షిర్డీ, షోలాపూరు తదితర ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శించి, హైదరాబాదు చేరుకున్నారని చెబుతున్నారు ఆ తర్వాత మంత్రాలయం వెళ్లారని అంటున్నారు. చివరకు బెంగళూరులో మిత్రుడి ఇంట్లో వారు పట్టబడ్డారు.
లక్ష్మి దంపతులు ఎటిఎం కార్డు వాడితే ఆ సమాచారం తమకు వచ్చేలా పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నారు. అలా లక్ష్మి దంపతులు ఎటిఎం కార్డు ద్వారా వారి మిత్రుడు బెంగళూరులోని జయనగర్లో డబ్బులు డ్రా చేయగానే పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో లక్ష్మి దంపతుల ఆచూకి కనిపెట్టిన ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది.
అయితే, పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితో పాటు ఓ రిటైర్డ్ న్యాయమూర్తి, అధికార నేతల సలహా మేరకు బెయిల్ వచ్చే వరకు పోలీసులకు చిక్కకుండా తలదాచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రొఫెసర్ లక్ష్మిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారనే విషయం నిజం కాదని, జిల్లా కోర్టులోనూ హైకోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో గత్యంతరం లేక అమె పోలీసులకు లొంగిపోయిందని న్యాయవాది వైకె అంటున్నారు.
ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలసంధ్యారాణి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంధ్యారాణి ఆత్మహత్యను తట్టుకోలేక మిర్యాలగూడలో ఉంటున్న సంధ్యారాణి భర్త రవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. లక్ష్మిని అరెస్టు చేయాలంటూ విద్యార్థులు పెద్ద యెత్తున ఆందోళనకు దిగారు.