నమ్మించి, తానే సిఎం: కెసిఆర్పై కోర్టుకు మాదిగదండోరా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానని నమ్మించి, అనంతరం తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టి దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కెసిఆర్ పైన పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం నాంపల్లి 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు.
తన న్యాయవాది బి రామ్మోహన్ రెడ్డితో కలిసి సతీష్ మాదిగ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే నియమిస్తానని కెసిఆర్ ప్రచారం చేస్తూ వచ్చాడని గుర్తు చేశారు.
ప్రజల ఉద్యమం, వేలాదిమంది అమరుల బలిదానాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను తానే తెచ్చానన్న ధీమాతో కెసిఆర్ తెలంగాణకు తొలి సిఎంగా తానే బాధ్యతలు చేపట్టి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. దళితులలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని సతీష్ మాదిగ ప్రశ్నిచారు.