నేతలను కంటతడి పెట్టించే చంద్రబాబు సెంటిమెంట్!!
విజయవాడ: ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా ఇద్దరు కలిస్తే తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'బాధ' గురించి మాట్లాడుకుంటున్నారని అంటున్నారు. పరిపాలనలో బిజీగా గడుపుతుండటం వల్ల తన మనవడితో ఆడుకోలేకపోతున్నానని చెబుతున్న విషయం తెలిసిందే.
గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను పరిపాలన, అభివృద్ధిలో బిజీగా ఉన్నానని, ప్రజల కోసం కష్టపడుతున్నానని, ఈ పనుల్లో పడి తాను తన మనవడు దేవాన్ష్తో ఆడుకోలేకపోతున్నానని చెబుతున్నారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. తన తండ్రి తన తనయుడితో ఆడుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాస రావులు కూడా ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోని బాధపడ్డారు.
అయితే, ఇప్పుడు ఈ విషయం ఏ ఇద్దరు టిడిపి నేతలు కలుసుకున్నా చర్చించుకుంటున్నారంటున్నారు. చంద్రబాబు నిజంగానే కేవలం పాలనలో, ఏపీ అభివృద్ధి కోసమే పని చేస్తే మనవడితో ఆడుకునేందుకు సమయం దొరుకుతుందని, ఆపరేషన్ ఆకర్ష్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని, అందుకే ఆయనకు సమయం దొరకడం లేదని ఇంకొందరు ఎద్దేవా చేస్తున్నారు.
చంద్రబాబు అభివృద్ధి మాట చెబుతూ, ఫిరాయింపుల పైన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, అందుకే సమయం చిక్కడం లేదని విపక్షాలు సెటైర్లు విసురుకుంటున్నాయని చెబుతున్నారు. అలాగే, పార్టీలోకి వచ్చిన కొత్త వారితో, పాతవారిని సమన్వయం చేసుకుంటూ పోతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు సెంటిమెంట్ పలికి కంటతడి పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వైరి పక్షాలు ఎద్దేవా చేస్తున్నాయంటున్నారు.