కావాలా వద్దా చెప్పండి: జగన్కు చంద్రబాబు నిలదీత
హైదరాబాద్: అనంతపురం నీరు కావాలా వద్దా అనే విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం శాసన సభలో నిలదీశారు. నదుల అనుసంధానంపై చంద్రబాబు సభలో వివరణ ఇచ్చారు.
గోదావరి నదిలో వృథాగా పోతున్న మిగులు జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్డీయే సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా కానీయమని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. రాయలసీమకు నీరు ఇవ్వాలన్నదే తమ దృఢ సంకల్పమన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరిని తెచ్చింది స్వర్గీయ ఎన్టీఆరే అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో వైసీపీ విమర్శలు గుప్పిస్తోందని ధ్వజమెత్తారు.
మీలా జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చమన్నారు. అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా టెండర్లు వేస్తామన్నారు. అవినీతి మీ ట్రాక్ రికార్డ్ అయితే, పారదర్శకత మా ట్రాక్ రికార్డ్ అన్నారు.
తోటపల్లి, వెలుగొండ ప్రాజెక్టులు తామే ప్రారంభించామని, వాటిని ఇప్పుడు తామే పూర్తి చేస్తామన్నారు. మదనపల్లి, గండికోటకు నీరు తెచ్చే బాధ్యత తనదే అన్నారు. అప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులను తాము పూర్తి చేస్తామన్నారు. నిర్దిష్ట గడవులోగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. నదుల అనుసంధానంతో గోదావరి జిల్లాలకు అన్యాయం చేయమని చెప్పారు. గోదావరిలో ఒక్క చుక్క నీరు తగ్గితే దానిని తాము కృష్ణకు మళ్లించమని చెప్పారు.