టి: ఇప్పుడే కాదని సుప్రీం తిరస్కరణ, మళ్లీ రావొచ్చు
371(డి) అధికరణ అమలులో ఉన్నంతకాలం ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయడానికి కేంద్రానికి అధికారం లేదంటూ హైకోర్టు న్యాయవాదుల సంఘం సీనియర్ సభ్యుడు పివి కృష్ణయ్య దాఖలు పిటిషన్ దాఖలు చేశారు. అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు.
అయితే ఈ పిటిషన్ను స్వీకరించి కేంద్రానికి నోటీసులు జారీ చేసేందుకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎస్ ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం సోమవారం నిరాకరించింది. ఇంకా అసెంబ్లీలో బిల్లుపై చర్చే పూర్తి కాలేదని, పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్ట లేదని, ఈ దశలో మేము జోక్యం చేసుకోలేమని తెలిపింది.
2013 ఆగస్టులో ఇదే అంశంపై వేసిన పిటిషన్ను కొట్టివేసి హైకోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించారని, హైకోర్టు కాదన్నప్పుడు తమ వరకు రావచ్చునని చెప్పారని కృష్ణయ్య గుర్తు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
విభజనపై తీసుకున్న నిర్ణయంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ వేశానని, దానిపై హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని మాత్రమే చెప్పాలని, ప్రస్తుతం పరిపక్వ దశ ఉన్నదా, అపరిపక్వ దశ ఉన్నదా అన్నది విచారణాంశం కాదని కృష్ణయ్య వాదించారు.తెలంగాణపై రాజ్యాంగపరమైన నిర్ణయం తీసుకోలేదని, రాజకీయ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్రంలో శత్రుత్వ వాతావరణం ఏర్పడిందని చెప్పారు.
కానీ కోర్టు ఆయన వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం విభజన అంశం అపరిపక్వ దశలో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని గతంలో హరీశ్ సాల్వేకు కూడా చెప్పానని, సరైన సమయంలో కోర్టుకు రావాలని కోరామని జస్టిస్ దత్తు చెప్పారు.
కేసు కొట్టి వేస్తే మళ్లీ కోర్టుకు వచ్చే పరిస్థితి ఉండదని కృష్ణయ్య చెప్పగా, 'కేసును ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. దీంతో అసెంబ్లీ, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.