జగన్ సర్కార్ కు సుప్రీం కీలక ప్రశ్న-లాయర్లపై శ్రద్ధ పర్యావరణంపై పెట్టొచ్చుగా..
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలో రూ.120 కోట్ల జరిమానా విధించింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది.
సుప్రీంకోర్టులో జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన రూ.120 కోట్ల జరిమానాను సవాల్ చేస్తూ సీనియర్ లాయర్లను వాదనల కోసం నియమించుకున్న ప్రభుత్వానికి ధర్మాసనం షాకిచ్చింది.ఇంతమంది సీనియర్ అడ్వకేట్లను నియమించుకుని భారీగా ఖర్చుపెట్టే బదులు అదేదో పర్యావరణాన్ని కాపాడేందుకు ఖర్చుపెట్టొచ్చుగా అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.
లాయర్లకు పెడుతున్న ఖర్చును తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో జగన్ సర్కార్ తరఫున వాదించేందుకు సిద్ధమైన లాయర్లు అవాక్కు కావాల్సి వచ్చింది.
ఒక్క కేసుకు ఇంతమంది సీనియర్ లాయర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన మూడు అప్పీళ్లలో భారీగా సీనియర్ లాయర్లను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పెంటపాటి పుల్లారావు పోలవరంపై ప్రభుత్వం చేసిన పర్యావరణ ఉల్లంఘనలపై తన వాదనలు వినిపించారు. వీటిని విన్న తర్వాత ప్రభుత్వం వీటిని కౌంటర్ చేసేందుకు నియమించుకున్న లాయర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది.