హైకోర్టు విభజనపై ముగిసిన వాదనలు: సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులు గురువారం వాదనలు ముగిశాయి. సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టును విభజించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా, వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాదులో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తమ నూతన రాజధానిలో హైకోర్టు భవనం నిర్మించలేదు కాబట్టి ఇప్పుడు విభజించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్ జనరల్ వాదించారు. పదేళ్ల వరకు హైదరాబాద్ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాబట్టి విడిగా హైదరాబాదులో హైకోర్టును ఏర్పాటు చేసుకోవచ్చునని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిన అవసరం లేదని ఇంతకు ముందు హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. రివ్యూ పిటిషన్ను కొట్టేయాలని ఎపి అడ్వొకేట్ జనరల్ సుప్రీంకోర్టకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఎపికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, దాని నుంచి హైకోర్టు నిర్మాణానికి ఎపి ప్రభుత్వం వాడుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాన్ని ఎపికి తరలించిందని, అసెంబ్లీని కూడా తరలించడానికి సిద్ధమైందని, అలాగే హైకోర్టును కూడా మార్చుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే హైదరాబాదులోనే విడివిడిగా హైకోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చునని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications