మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు; చిలకలూరిపేటలో ఘర్షణ ఎఫెక్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మాజీ మంత్రి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తో సహా మరో ఐదుగురిపై పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట లో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటలో ఓ కార్యక్రమం నిర్వహించటానికి వచ్చిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తనను కులం పేరుతో దూషించారని, తనను నెట్టి వేశారని మున్సిపల్ అధికారిణి కోడిరెక్క సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.
చిలకలూరిపేటలో టీడీపీవర్సెస్ వైసీపీ, అధికారులు
చిలకలూరిపేటలో మంచినీటి చెరువు దగ్గర శుక్రవారం ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పునః ప్రారంభోత్సవం సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పునః ప్రారంభోత్సవం చేయనున్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ప్లాంట్ పునః ప్రారంభోత్సవానికి అనుమతి లేదని వారు టిడిపి నేతలను అడ్డుకున్నారు.
ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పునః ప్రారంభానికి యత్నించిన మాజీ మంత్రి
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. దీంతో ఈ ప్లాంటు పునః ప్రారంభోత్సవానికి వెళ్లిన పత్తిపాటి పుల్లారావు అడ్డుకోవడంతో, అక్కడకు చేరుకున్న టిడిపి నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.
కులం పేరుతో దూషించారని మున్సిపల్ అధికారిణి ఫిర్యాదుతో మాజీమంత్రిపై కేసు నమోదు
ఇక అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు తోపులాటలు, ఘర్షణల మధ్య మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్లాంటు లోపలికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో తనను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కులం పేరుతో దూషించారని, తన ను పక్కకు నెట్టి వేశారని మున్సిపల్ అధికారిణి చేసిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు మాజీ మంత్రి పై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
ఏ1గా ప్రత్తిపాటి పుల్లారావు.. మరో నలుగురిపైనా కేసులు
ఈ కేసులో ఏ1గా పత్తిపాటి పుల్లారావు, ఏ2 గా మదన్మోహన్, ఏ3 గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4 గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5 గా రాష్ట్ర టిడిపి నాయకుడు కరీముల్లా ల పేర్లు చేర్చారు పోలీసులు. శుక్రవారం నాడు చిలకలూరిపేట లో జరిగిన ఘటన పై మున్సిపల్ అధికారి సునీత మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులు తనను కారుతో గుద్దించే ప్రయత్నం చేశారని, ఎస్సీ మహిళ అయిన తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు.
కక్ష సాధింపులో భాగమే కేసులు అన్న టీడీపీ నాయకులు
ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి విడదల రజిని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, కావాలని తమపై తప్పుడు కేసులు పెట్టించారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.