కుంభమేళాకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
Maha Kumbhmela 2025: మహా కుంభమేళాకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే 32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తిరుపతి నుంచి మరో నాలుగు రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మహాకుంభ మేళాకు ఏపీ నుంచి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. రైళ్లతో పాటుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదే విధంగా టూరిజం శాఖ ప్యాకేజీలను ప్రకటించింది. అయినా, ఇంకా రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక రైళ్లళ్లో పెరుగుతున్న రద్దీ కారణంగా.. అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, తిరుపతి నుంచి కుంభమేళాకు వెళ్లే ప్రయాణీకుల కోసం తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి- దానాపూర్ మధ్య (వయా హైదరా బాద్ ) ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.

ఈ నెల 14, 18 తేదీల్లో తిరుపతి నుంచి దానాపూర్కు రెండు రైళ్లు ప్రకటించారు. ఇప్పుడు అదే విధంగా దానాపూర్ నుంచి తిరుపతికి మరో రెండు రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి బయల్దేరి ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కోడూరు, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, తాడిపర్తి, గుత్తి, డోన్, కర్నూల్, గద్వాల్, వనపర్తి, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, ఉమ్డానగర్, కాచి గూడ, మల్కాజిగిరి, చర్లపల్లి, ఖాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బలార్ష, ప్రయాగరాజ్, మీర్జాపూర్, బక్సర్ తదితర స్టేషన్లలో (రెండు వైపులా) హాల్ట్ ఉంటుందని వివరించారు.
ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. దీంతో.. పలు జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం నడుపుతోంది. కాగా, ప్రత్యేక రైళ్లకు డిమాండ్ పెరిగితే అదనపు కోచ్ లు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేసారు. విశాఖ, కాకినాడ, విజయవాడ నుంచి పలు ప్రత్యేక రైళ్లు ఇప్పటికే కుంభమేళా రద్దీ కోసం ఏర్పాటు చేసారు. కాగా, సికింద్రాబాద్ నుంచి మరో రెండు రైళ్లు ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications