నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్-ఈ రైళ్ల రద్దు..!
నెల్లూరు-సూళ్లూరుపేట మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. చెన్నై సెంట్రల్-గూడూరు మార్గంలో ప్రస్తుతం పనులు జరుగుతున్న కారణంగా అటువైపు వెళ్లే రెండు రైళ్లను ఏకంగా మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ నెల 24 నుంచి మార్చి 1 లోపు మూడు రోజుల పాటు ఈ రైళ్లు అటువైపు రాకపోకలు సాగించవు. దీన్ని గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
చెన్నె సెంట్రల్-గూడూరు సెక్షన్ లో ప్రస్తుతం ఓ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని వల్ల అటువైపు వెళ్లే రైళ్ల రాకపోకల్ని దక్షిణ మధ్య రైల్వే నియంత్రిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు-సూళ్లూరు పేట మార్గంలో వెళ్లే రెండు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూళ్లూరు పేట-నెల్లూరు మధ్య నడిచే 66035 రైలు ఈ నెల 24, 27, మార్చి 1 తేదీల్లో రద్దు చేశారు. అలాగే నెల్లూరు -సూళ్లూరు పేట మధ్య నడిచే 66036 రైలును కూడా ఇవే తేదీల్లో రద్దు చేశారు.

వంతెన పనుల కారణంగా ఈ రెండు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి ఎ. శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేసారు. అయితే పనులు పూర్తయిన తర్వాత మాత్రం ఈ రైళ్లు యథావిథిగా రాకపోకలు సాగించబోతున్నాయి. దీంతో ఈ మూడు రోజుల్లో ఆయా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం దీన్ని గుర్తుంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications