తిరుపతి నడిబొడ్డున.. ఎయిర్పోర్ట్ను తలదన్నేలా
టెంపుల్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్'లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 300 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం దీని పునర్నిర్మాణ పనులను చేపట్టింది.
2022లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్లో రెండు ప్రధాన భవనాలు నిర్మిస్తున్నారు. ఒకటి ఉత్తర వైపున, మరొకటి దక్షిణ వైపున బేస్మెంట్ పార్కింగ్తో రూపుదిద్దుకుంటోన్నాయి.

ప్రయాణికుల రద్దీని మెరుగుపరచడానికి, అనేక లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్లాట్ఫారమ్లను రెండు విశాలమైన ఎయిర్ కాన్కోర్స్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. దక్షిణ వైపున కొత్తగా రోడ్డు సదుపాయాన్ని కల్పిస్తోన్నారు. ఇది ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో, ఎయిర్ పోర్ట్ ను తలదన్నేలా ఈ స్టేషన్ రూపుదిద్దుకుంటోంది.
ఈ స్టేషన్లో వెయిటింగ్ హాళ్లు, లాంజ్లు, షాపులు, మెరుగైన సౌకర్యాలతో కూడిన ఆధునిక వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కొత్త స్టేషన్ భవనం డిజైన్ తిరుమల ఆలయ గోపురాల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేషన్ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
తాజాగా- దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. గుంతకల్ డివిజినల్ రైల్వే మేనేజర్ తో కలిసి తిరుపతి రైల్వే స్టేషన్ పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మొత్తం రెండు దశల్లో అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. మొదటి దశలో 3 అంతస్తులు, రెండవ దశలో 10 అంతస్తులు నిర్మించనున్నారు. 20 లిఫ్టులు, 22 ఎస్కలేటర్లను నెలకొల్పనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా అన్ని ప్లాట్ఫామ్ల విస్తరణను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఉత్తరం వైపున 10,800 చదరపు మీటర్ల అంతస్తు విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవన నిర్మాణ పనులను జీఎం పరిశీలించారు. ఇక్కడ రిజర్వేషన్ కార్యాలయం, రిటైరింగ్ గదులు, రైల్వే కార్యాలయాలు ఉంటాయి. దక్షిణం వైపున, బేస్మెంట్ వద్ద పార్కింగ్ కోసం 9,261 చదరపు మీటర్ల స్థలన్ని కేటాయించారు.
ఇక్కడ 200 ఫోర్ వీలర్లు, 300 టూ వీలర్లను ఒకేసారి పార్క్ చేయవచ్చు. ఇక్కడ కూడా 14,621 చదరపు మీటర్ల అంతస్తు విస్తీర్ణంలో జీ+3 అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వైపులా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, టికెట్ కౌంటర్లు ఉంటాయి. సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ను వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేశారు.












Click it and Unblock the Notifications