Good news: ఈనెల 19నుంచి రైళ్ల పునరుద్దరణ : పట్టాలపైకి 82 సర్వీసులు : కొత్త నెంబర్లు-ధరలు..!!
కరోనా దెబ్బతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిన రైళ్ల సర్వీసులు క్రమేణా అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టటంతో ఈ నెల 19వ తేదీ నుంచి 82 రైళ్ల సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. అందులో 16 ఎక్స్ ప్రెస్ స్పెషల్ సర్వీసులుగా... అదే విధంగా 66 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లుగా వెల్లడించారు. దాదాపుగా 15 నెలల విరామం తరువాత ఈ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ నెల 19వ తేదీ నుంచి రైళ్లు..
ఈ నెల 19వ తేదీ నుంచి వరుసగా 20, 21, 22 తేదీల్లో ఈ రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవన్నీ అన్రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయని అధికారులు స్పష్టం చేసారు. అయితే, గతంలో వివిధ నెంబర్లతో నడిచిన రైళ్లకు కొత్త నెంబర్లు కేటాయించారు. కరోనా ప్రారంభం నుండి రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లల్లో స్పెషల్ ఛార్జీల పేరుతో సాధారణ ఛార్జీ కంటే అదనంగా వసూలు చేస్తోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్యాసింజర్ ఛార్జీ వసూలు చేస్తారా, ఎక్స్ప్రెస్ ఛార్జీని వసూలు చేస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
టిక్కెట్లు కొనుగోలు ఇలా..
ఇక, ప్రయాణం చేయాలనుకొనే వారికి టిక్కెట్ల కొనుగోలు పైన రైల్వే శాఖ అనేక మార్గాలు సూచించింది. స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లతో పాటు యూటీఎస్ యాప్ (ఆన్లైన్), ఏటీవీఎమ్ (అటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్లు), సీవోటీవీఎమ్లు (కాయిన్ టికెట్ వెండింగ్ మెషిన్స్) మొదలగు వాటిలో కూడా టికెట్లు తీసుకోవచ్చు. ఇంతేకాక ప్రయాణికులకు సీజనల్ టికెట్లు తీసుకునే సదుపాయం కూడా ఉంది.
కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తూ..
రైల్వే స్టేషన్లలో ..అదే విధంగా రైళ్లలో కూడా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య స్పష్టం చేసారు. ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా రైళ్ల నిర్వహణ ఉంటుందన్నారు. ప్రయాణీకులు..రైల్వే సిబ్బంది..రైళ్లలోనూ..స్టేషన్లలోనూ ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని తేల్చి చెప్పారు. కచ్చితంగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, క్రమంగా శానిటైషన్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం కోరారు.