రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం, ఖాతాల్లో నగదు జమ చేసిన జగన్, 12 వేల కోట్ల మేర లబ్ది
ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాల విషయంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. గతేడాది వైఎస్సార్ కాపు నేస్తం పేరుతో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా కరోనాను లెక్క చెయ్యకుండా కాపు నేస్తం పథకం అమలు చేశారు.
రెండో ఏడాది లబ్దిదారులకు వైఎస్సార్ కాపు నేస్తం, ఖాతాల్లో వేసిన జగన్
ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెండో ఏడాది వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కాపు మహిళలను ఉద్దేశించి, వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రెండో ఏడాది వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఈ ఏడాది పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు 490.86 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేశారు.
12 వేల కోట్ల మేర కాపులకు లబ్ది.. కరోనా కారణంగా ఇబ్బంది ఉన్నా వెనక్కు తగ్గటం లేదన్న సీఎం
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ అర్హులైన కాపు మహిళలకు ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి బాసటగా నిలుస్తామని, ఐదేళ్లలో మొత్తంగా 75 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు రూ. 12 వేల కోట్ల మేర కాపులకు లబ్ది చేకూరిందని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. నిరుపేద కాపు మహిళలకు వైయస్సార్ కాపు నేస్తంతో భరోసా అందిస్తున్నామన్నారు.
Recommended Video
మ్యానిఫెస్టోలో చెప్పకున్నా వైఎస్ఆర్ కాపు నేస్తం ఇస్తున్నామని వెల్లడి
మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయస్సార్ కాపు నేస్తం పథకానికి శ్రీకారం చుట్టామని వెల్లడించిన జగన్ గత ప్రభుత్వ ఏం చెప్పింది ఏం చేసిందో అందరూ ఆలోచించుకోవాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిరుపేదల కోసం తాము ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తుందని వెల్లడించారు. వివక్షకు తావు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం జగన్, అర్హులైన మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అగ్ర వర్ణ పేదల రిజర్వేషన్లతో కాపులకు మేలు
గత ప్రభుత్వం కాపులు బీసీలను, ఓసీలను అయోమయానికి గురిచేసిందని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా న్యాయవివాదాలు సృష్టించిందని సీఎం జగన్ పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మాట్లాడిన ఆయన రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని విద్యా ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని జగన్ స్పష్టం చేశారు.