ఏపీ సర్కార్ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల ఫైర్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థల్లో ప్రస్తుతం సచివాలయాలు మాత్రమే కొనసాగుతున్నాయి. వాలంటీర్లను పూర్తిగా పక్కనబెట్టేశారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లోనూ హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగుల్లో ఆగ్రహం నింపుతున్నాయి. సచివాలయాల్లో ఉద్యోగుల్ని రెండుగా విభజించి హేతుబద్ఘీకరణ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉద్యోగులు తప్పుబడుతున్నారు.
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించి మార్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు.
వ్యవస్థలో మార్పుల వలన ఉద్యోగులకు వ్యవస్థకు మేలు చేకూర్చే నిర్ణయాలు జరగాలంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించడమే సరైన విధానం అన్నారు.

గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందు కేబినెట్, ఉన్నతాధికారులు సుదీర్ఘ అనుభవం, శాశ్వత సభ్యత్వం కలిగిన ఉద్యోగసంఘాలతో చర్చించి వ్యవస్థకు ఉద్యోగులకు మేలు జరిగే సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన నాటి నుండి ఉద్యోగులు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించారని, ఇదే క్రమంలో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో వివక్షకు గురి అయిన సందర్భాలు కోకొల్లలు అని ఆరోపించారు.
సచివాలయ ఉద్యోగులకు ఒక్కరోజు సెలవు కావాలన్నా పదిమంది అధికారుల చుట్టూ కాళ్ళకు చెప్పులరిగేలా తిరుగుతున్న పరిస్థితులు అనేకం అని వారు గుర్తుచేశారు. ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఉద్యోగులు ఆత్మగౌరవ సమస్యతో తల్లడిల్లిపోతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని వింత పరిస్థితులు కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఉండడం అత్యంత బాధాకరం అన్నారు. కోటి ఆశలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు ఏ పనిచేయాలో తెలియని అయోమయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఏ రోజు ఏ మార్పు జరుగుతుందో తెలియక ఉద్యోగులు సతమతమవుతున్నారని సమాఖ్య ప్రతినిదులు ఆరోపించారు. జాబ్ చార్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అందుకు విరుద్ధంగా రోజు కూలీల మాదిరిగా ఏ పని పడితే ఆపని చేస్తూ క్షేత్రస్థాయి అధికారుల వేధింపులు, అవమానాలు, ఈసడింపులు భరిస్తూ ఆదివారాలు పండుగ సెలవులు సైతం లేకుండా మానసిక ప్రశాంతత లేని విధులు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
ఉన్నత చదువులు చదివిన సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో అర్హత మేరకు అవకాశాలు, పదోన్నతులు కల్పించాలని వారు కోరారు. ఈ క్రమంలో మీడియాలో వార్తలు ఉద్యోగులను మరింత అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు.కాబట్టి ప్రభుత్వం అధికారికంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా సందేహాలను నివృత్తి చేస్తూ,ఉద్యోగులకు, వ్యవస్థకు మేలు చేకూర్చేలా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. తేడా వస్తే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications