సెక్షన్ 8: 'పీకల్లోతులో బాబు, నాడు సెక్షన్ 8 పట్టించుకోని కేసీఆర్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ పరస్పరం రాజకీయ లబ్ధికోసం ఘర్షణ పడుతున్నారని సీపీఐ నేత నారాయణ సోమవారం మండిపడ్డారు. సీఎంలు ఇద్దరూ ఆచరణ సాధ్యం కాని హామీలు, మాయమాటలతో ప్రజలను మోసం చేయటంలో పోటీ పడుతున్నారన్నారు.
ఓటుకు నోటు కుంభకోణంలో పీకల లోతువరకూ మునిగిపోయిన చంద్రబాబు తన బాధను రాష్ట్ర ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సెక్షన్ 8 గురించి ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు దాన్ని తీవ్ర సమస్యగా లేవదీస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్లో సెక్షన్ 8ను అమలు చేయవలసిన అవసరం లేదన్నారు. పరిస్థితులను బట్టి గవర్నర్తో సంప్రదించిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలుపై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పునర్విభజన చట్టంలోనే ఉందన్నారు.

గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించి సముచితమైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతున్నారన్నారు. గవర్నర్కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలన్నారు.
కేంద్రం జోక్యం లేకుండా సమస్య పరిష్కారానికి ఇద్దరు సీఎంలు యత్నించటం మంచిదన్నారు. విభజన పర్యవసానంగా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రధాని మోడీ ఏడాది పాలనపై నారాయణ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్రం చొరవ తీసుకోవాలి: రామ్మోహన్ నాయుడు
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలపై స్పష్టత లేకపోవడం వల్లే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిప్రాయ పడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీస్తున్న సెక్షన్ 8 అమలుపై కూడా స్పష్టతలేకపోవడం అపోహలు తలెత్తాయన్నారు.
కేంద్ర చొరవ తీసుకుని ఇరురాష్ట్రాల సిఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోలేని స్థితికి సమస్యలు చేరుకున్నాయన్నారు. సెక్షన్ 8 అమలుపై గవర్నర్ సానుకూలంగా వ్యవహరించాలన్నారు.












Click it and Unblock the Notifications