సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: ఆవేదనకు లోనయ్యానంటూ.. కేటీఆర్కు పవన్ కళ్యాణ్ సలహా, బాధాకరమన్న చంద్రబాబు!!
సికింద్రాబాదులోని ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో ఎలక్ట్రిక్ బైక్ ల పేలుళ్లు సంభవించి 8మంది మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా అందరి ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఇక ఈ దుర్ఘటనపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఈ దుర్ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం సైతం అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు మూడు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
ఆవేదనకు లోనయ్యా... అగ్నిప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్
ఇప్పటికే ఈ ఘటనపై పలువురు స్పందించగా, తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ అగ్ని ప్రమాద దుర్ఘటనపై స్పందించారు. సికింద్రాబాద్ లోని ఒక హోటల్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు ఈ విధంగా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో పలువురు క్షతగాత్రులయ్యారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
అగ్నిప్రమాదాల నివారణకు కేటీఆర్ కు సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ తెలిపారు. మృతుల కుటుంబాలను క్షతగాత్రుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యాటకంగా, వాణిజ్యపరంగా, ఐటీ రంగంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాజధానిలో ఇటువంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా హోటల్స్, మరియు బహుళ అంతస్తుల భవనాలలో ఎప్పటికప్పుడు అగ్నిమాపక శాఖ, ఇతర రక్షణ తనిఖీలు చేయించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు సూచిస్తున్నా అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ద్వారా స్పందించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు
ఇక సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్లోని రూబీ లాడ్జ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది పర్యాటకులు మరణించడం బాధాకరం అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.