సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 4 గంటలే.. త్వరలోనే పరుగులు!
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి కేవలం 4.30 గంటల సమయం పట్టనుంది. ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసిన ఎస్ఎం కన్సల్టెన్సీ సంస్థ మార్చికి సర్వేను పూర్తిచేయబోతోంది. ఈ సర్వేను ఆధారంగా చేసుకొని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని భారత రైల్వే ఎంపిక చేయబోతోంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ప్రారంభించే సమయానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయబోతున్న హైస్పీడ్ రైళ్లకు ప్యాసింజర్స్ రద్దీ ఎలా ఉండబోతోంది? దానికి డిమాండ్ ఎలా ఉంటుంది? అనే విషయాలను కూడా సర్వేలో పొందుపరుస్తారు. డీపీఆర్ సర్వేకు 6 నెలల నుంచి 8 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య రైల్వే ప్రయాణానికి 12 గంటల నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందే భారత్ రైళ్లల్లో మాత్రం 9 గంటల సమయం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి రోజూ 10 రెగ్యులర్ రైళ్లతోపాటు 12 వారాంతపు రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు 50వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోజుకు 55వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
మరో 10వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులుంటారు. ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగంతోపాటు ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు. 922 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కు భారీ వ్యయమవుతుందని, నేలపైనే నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగున్నర గంటల సమయం పట్టనుంది.












Click it and Unblock the Notifications