బాబు అప్రమత్తం: ఇంటి వద్ద భద్రతా సిబ్బంది మార్పు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు టీఆర్ఎస్ ప్రభుత్వం బహిర్గతపరచిన నేపథ్యంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ముందుస్తు చర్యల్లో భాగంగా తన నివాసం వద్ద భద్రతా ఇబ్బందిని మార్చివేసినట్లు సమాచారం.
ఇంటి వద్ద భద్రతా పర్యవేక్షణను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. అదే విధంగా గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ సిబ్బందిలోనూ సమూల మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్పై ఏపీ డీజీపీ జేవీ రాముడిపై చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఏపీ మంత్రి వర్గ సమావేశానికి డీజీపీ రాముడిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. నాలుగు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
దీంతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి ఈ నెల 15వ తేదీ వరకు కోర్టు రిమాండ్ పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన గొంతుతో రికార్డయిన ఆడియో టేపులు విడదలయ్యాయి.