ప్రభుత్వ ప్యాకేజీకి రైతుల తిరస్కారం:మా భూములకు ఇంకా మంచి ప్యాకేజీ కావాలి
అమరావతి:తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి నుంచి అమరావతి వరకు వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డు మార్గంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారంపై ప్రభుత్వంతో విభేదించారు. భూములకు ప్యాకేజీ విషయమై చర్చించేందుకు గుంటూరు జేసీ ఇంతియాజ్ గురువారం తాడేపల్లిలో రైతులతో సమావేశమయ్యారు.
ప్రభుత్వ పరిహారం గురించి బాధితులకు వివరించి వారిని ఒప్పించే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేయగా అధికారుల ప్రయత్నం సఫలం కాలేదు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ గురించి రైతులకు, భాదితులకు జేసీ ఇంతియాజ్ వివరించగా రైతులు, బాధితులు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూములు చాలా విలువైనవని, తాము ఇంకా మెరుగైన ప్యాకేజీ కోరుకుంటున్నామని చెప్పారు.

అసలు ఈ భూములు ఇచ్చేందుకు ఎక్కువమంది విముఖత చూపుతున్న నేపథ్యంలో అత్యధిక రైతులు,నివాస పట్టాలు కలిగినవారు గైర్హాజరు అయ్యారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మార్గంలో భూములు కోల్పోతున్న బాధితుల్లో రైతులు, పట్టాలు కలిగిన నివాస స్థలాలవారు మొత్తం 65 మంది హాజరు కావల్సివుండగా కేవలం 18 మంది మాత్రమే విచ్చేశారు.
సమావేశం ద్వారా రైతుల,బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నామని...మిగిలిన వారి అభ్యంతరాలను కూడా సేకరిస్తామని జేసీ ఇంతియాజ్ ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు రైతులు, ప్లాట్ల యజమానులు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ఏ ఆధారాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి గజానికి రూ.40 వేలు చెల్లించారని...తమకు కూడా అలాంటి ప్యాకేజీనే కావాలని డిమాండ్ చేశారు. ఈ అంశం ఇప్పటికే వివాదాస్పదం కాగా బాధితుల తాజా డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications