వైసీపీ మాజీ మంత్రికి మరో షాక్..! 14 రోజుల రిమాండ్..!
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju)కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. కుమారుడు ఆరవ్ వర్మ చేసిన రోడ్డు ప్రమాదం కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పలరాజును నిన్న పోలీసులు కాశీబుగ్గలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అనంతరం ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఆయన్ను రెండు వారాల పాటు రిమాండ్ కు పంపుతూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నెల 10వ తేదీన సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఓ బైక్ యాక్సిడెంట్ చేశారు. స్థానికంగా దానయ్య అనే గొర్రెల కాపరిని బైక్ యాక్సిడెంట్ చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఈ కేసులో ఆరవ్ కు బదులుగా సిద్దార్ధ అనే మరో యువకుడిని నేరస్తుడిగా చూపేందుకు ఆధారాల్ని తారుమారు చేసి, అతని కుటుంబంపై కేసు ఒప్పుకునేలా ప్రలోభపెట్టారన్న ఆరోపణల్ని అప్పలరాజు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కుట్ర కేసు నమోదు చేశారు.

ఈ కేసులోనే అప్పలరాజును నిన్న అరెస్టు చేసిన పోలీసులు.. ఇవాళ పలాస కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ కోరగా.. అప్పలరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో విచారణ జరిపిన కోర్టు.. అప్పలరాజుకు బెయిల్ నిరాకరిస్తూ రెండు వారాల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. అనంతరం అప్పలరాజును శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో అప్పలరాజు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications