పవన్ నియోకవర్గంపై జగన్ కీలక నిర్ణయం - ఎన్టీఆర్ జిల్లాలో సైతం : పక్కా వ్యూహాత్మకంగా..!!
కొత్త జిల్లాల విషయంలో సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల ఖరారు.. వాటికి పేర్ల విషయంలోనూ అదే విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో గుడివాడ రాజకీయం - ఉద్యోగుల పీఆర్సీ రగడ మధ్య ఆకస్మికంగా కొత్త జిల్లాల అంశం తెర పైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ నోటిఫికేషన్లు జారీ చేసారు. అందులో కొన్నింటి పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రజాభిప్రాయ సేకరణకు సమయం ఉండటంతో..ఆ తరువాతనే ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ప్రతీ నిర్ణయంలో పక్కాగా
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఇదే సమయంలో టీడీపీకి మద్దతుగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గం ఎక్కువగా గెలుపు ఓటములను డిసైడ్ చేసే క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. తొలుత మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని భావించారు. కానీ, వ్యూహంలో భాగంగా క్రిష్ణా జిల్లాకు మార్చారు.
టీడీపీ నేతలు తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ పేరును స్వాగతిస్తూనే... ఆ క్రెడిట్ జగన్ కు రాకుండా గతంలో అన్నా క్యాంటీన్లు తొలిగింపు.. తాజాగా పల్నాడులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం అంశాలను ప్రస్తావిస్తోంది. ఇక, ఇదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కానీ, ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు.
జిల్లాలతో పాటుగా రెవిన్యూ డివిజన్లు
ఇప్పుడు కొత్త జిల్లాలతో పాటుగా కొత్తగా రెవిన్యూ డివిజన్ల అంశంలోనూ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొత్త జిల్లాల తో పాటుగా కొత్తగా రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. 15 డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతమున్న 51 డివిజన్లలో నాలుగు డివిజన్లు ప్రస్తుతం ఉన్న డివిజన్లలో కలిసిపోనున్నాయి.
ఈ నాలుగు పోగా మిగిలిన 47తోపాటు కొత్తవి 15 కలిపి మొత్తం 62 డివిజన్లు కానున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లాలో కనీసం రెండు డివిజన్లు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం ను కొత్తగా రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రాజకీయంగా స్థానిక ప్రజల్లో మైలేజ్ సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
భీమవరం రెవిన్యూ డివిజన్ గా
ఇక, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాంతాల్లో టీడీపీ ఏ మాత్రం పై చేయి సాధించకుండా ముందస్తు వ్యూహంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాల పేర్లు.. కొత్త రెవిన్యూ డివిజన్ల ఖరారు పైనా చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు జరిగాయి.
కొన్ని ప్రాంతాల్లో కేబినెట్ లో వచ్చిన ప్రతిపాదనలు.. నోటిఫికేషన్ జారీలో చేసిన ప్రకటన విషయంలోనూ మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో కొత్తాగా ఏర్పడిన రెవిన్యూ డివిజన్లలో బాపట్ల జిల్లాలో ఒక్క రెవెన్యూ డివిజన్ కూడా లేకపోవడంతో బాపట్ల, చీరాల డివిజన్ల ఏర్పాటును కొత్తగా ప్రతిపాదించారు.
ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసేలా
అలాగే ప్రకాశం జిల్లాలో కనిగిరి, నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, డోన్, అనంతపురం జిల్లాలో గుంతకల్, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్లు సమీప డివిజన్లలో విలీనం కానున్నాయి.
ఎటపాక.. రంపచోడవరం డివిజన్లో, కుకునూరు.. జంగారెడ్డిగూడెం డివిజన్లో, కనిగిరి.. కందుకూరు డివిజన్లో, ధర్మవరం.. కల్యాణదుర్గం, అనంతపురం డివిజన్లలో కలవనున్నాయి. వీటి పైన వైసీపీ నేతల్లోనే కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీటి పైన అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత మార్చి తొలి వారంలో తుది నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
అయితే, అంతిమంగా రాజకీయంగా పై చేయి సాధించే దిశగానే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. దీంతో..ఈ కొత్త జిల్లాలు.. రెవిన్యూ డివిజన్ల విషయంలో తుది నిర్ణయాలు ఎలా ఉంటాయనే అంశం పైన ఆసక్తి నెలకొని ఉంది.