సీమాంధ్ర: సిఎం కుర్చీకి జగన్ వర్సెస్ చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత సీమాంధ్ర ఎన్నికల ప్రచారంతో వేడెక్కింది. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇరు పార్టీల మధ్యనే పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మే 7వ తేదీన సీమాంధ్రలో పోలింగ్ జరగనుంది. జాతీయ స్థాయిలో ప్రధాని కోసం బిజెపి నేత నరేంద్ర మోడీకి, కాంగ్రెసు నేత రాహుల్ గాంధీకి మధ్య పోటీ నెలకొన్నట్లే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు, జగన్కు మధ్య నెలకొంది. తన కలలను సాకారం చేసుకోవడానికి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి అగ్రనేత మోడీ సహకారం తీసుకుంటుంటే, జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు నామమాత్రం అవుతుందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర ఉనికినైనా చాటుకుందా అనేది అనుమానంగానే ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ఇరువురు నేతలు కూడా రాయలసీమకు చెందినవారే కావడం విశేషం. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఆరో సారి పోటీ చేస్తుండగా, జగన్ పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 1989 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. రెండు విడతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు, 175 శాసనసభా స్థానాలకు 2,243 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తనను గెలిపిస్తే రాజధానిని నిర్మించడానికి కూలీగా పనిచేస్తానని, హైదరాబాద్ వంటి నగరాలను తీర్చి దిద్దుతానని 64 ఏళ్ల చంద్రబాబు హామీ ఇస్తున్నారు. 41 ఏళ్ల జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధపడ్డారు.