పురంధేశ్వరి, నేతల ఇళ్ల ముట్టడి, ఉద్రిక్తం: కావూరి ఫైర్
ఒంగోలులో ఎంపి మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ఎపిఎన్జీవోలు, సమైక్యవాదులు ముట్టడించారు. విశాఖలో కేంద్రమంత్రి పురంధేశ్వరి నివాసం వద్ద సమైక్యవాదులు ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎంపి చింతా మోహన్ ఇంటిని ఉద్యోగ సంఘాల నేతలు, విజయనగరంలో ఎంపి బొత్స ఝాన్సీ ఇంటిని ఉపాధ్యాయులు, విజయవాడలో లగడపాటి రాజగోపాల్ ఇంటిని ఎపిఎన్జీవోలు ముట్టడించారు.
భేటీల మీద భేటీలు
హైదరాబాదులోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, మంత్రి బస్వరాజులు వేర్వేరుగా సమావేశమయ్యారు.
సోనియాతో ఆజాద్
న్యూఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎపి మాజీ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ కానున్నారు.
షిండేతో కావూరి భేటీ
షిండేతో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు భేటీ అయ్యారు. ఆయన కేబినెట్ నోట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తాను కేబినెట్ నోట్ను వ్యతిరేకిస్తానని చెప్పారు. అదిష్టానం నిర్ణయం ఏకపక్షమని మండిపడ్డారు.
సీమాంధ్ర కాంగ్రెసు నేతల భేటీ
మంత్రుల నివాసంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, మంత్రులు శైలజానాథ్, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, సి రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, తోట నర్సింహులు, గల్లా అరుణ కుమారి, కొండ్రు మురళి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.