సమైక్య: కిరణ్ భేటీలో ఏకవ్యాక్యం: ప్రణబ్తో భేటీకి జగన్
హైదరాబాద్: సీమాంధ్ర నేతల్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. విభజనపై మంత్రుల బృందానికి(జివోఎం)కు ఇవ్వాల్సిన నివేదిక పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు సీమాంధ్ర నేతలు సచివాలయంలో భేటీ అయి ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ భేటీకి మంత్రులు కొండ్రు మురళీ, రఘువీరా రెడ్డి, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, శత్రుచర్ల విజయ రామరాజు, గంటా శ్రీనివాస రావు, ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణలతో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తదితరులు వచ్చారు.
మంత్రులు తోట నర్సింహం, కాసు వెంకటకృష్ణా రెడ్డి, మాణిక్య వర ప్రసాద్, అహ్మదుల్లా, మహీధర్ రెడ్డి, బాలరాజు, వట్టి వసంత్ కుమార్ తదితురులు హాజరు కాలేదు. భేటీకి పదమూడు మంది మంత్రులు హాజరయ్యారు. ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి వచ్చారు. ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రితో భేటీ అయిన నేతల్లో జివోఎంకు ఇవ్వాల్సిన నివేదిక పైన చర్చ సాగింది. జివోఎంకు నివేదిక ఇస్తే విభజనకు అంగీకరించినట్లవుతుందని, ఇవ్వకుంటే సమస్యలు పరిష్కారం కావని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు ఏకవ్యాక్య తీర్మానం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ వారు ఏకవ్యాక్య తీర్మానం చేశారు. దీనినే జివోఎంకు పంపించనున్నారు.
ప్రణబ్ పైన ఆశలు, వరుసగా అపాయింటుమెంట్లు
కేంద్రం, కాంగ్రెసు పార్టీ విభజనపై వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు పలువురు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ పైన ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాదు వస్తున్న రాష్ట్రపతికి సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సమైక్య రాష్ట్ర అనివార్యం వివరించాలని భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యాంధ్ర కోసం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నారు. ఆయన ప్రణబ్ను రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు కలవనున్నారు. సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, లక్ష్మీ పార్వతి తదితరులు కూడా ఆయనను కలవనున్నారు.
రేపు సిపిఐ నివేదిక
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జివోఎంకు సిపిఐ తరఫున మంగళవారం నివేదిక ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రుల బృందం నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నట్టు తెలిపారు. అసలు అఖిలపక్షం పెట్టమని కోరిందే తామని ఆయన వెల్లడించారు. సీమాంధ్రుల ఆందోళనలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications