'సమైక్య ప్రజావాణి పార్టీ' పబ్లిక్ నోటీస్: కిరణ్ రెడ్డి దేనా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీమాంధ్రలో జోరుగా ప్లెక్సీలు వెలవడమే కాకుండా టీవి ఛానళ్లలో ప్రకటనలు హోరెత్తుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సమైక్యాంధ్ర అజెండాగా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కొత్త పార్టీ వస్తోందంటున్నారు.
తాజాగా కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై పబ్లిక్ నోటీస్ రూపంలో ప్రకటనలు కూడా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'సమైక్య ప్రజావాణి' పేరిట పార్టీ పెడుతున్నట్లుగా అందులో తెలిపారు. 'సమైక్య ప్రజావాణి' పేరుపై అభ్యంతరాలుంటే నెల రోజుల్లోపు ఎన్నికల కమిషన్కు తెలియచేయాలని కోరుతూ ఈ ప్రకటన జారీ చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడిగా కెఆర్ రెడ్డి, కార్యదర్శిగా సి అనిల్ కుమార్ రెడ్డి, కోశాధికారిగా జి వెంకట రామరెడ్డి పేర్లను ఇచ్చారట.
పార్టీ రిజిస్ట్రేషన్కు ఇప్పటికే తాము ఎన్నికల కమిషన్కు దరఖాస్తు సమర్పించామని తెలిపారు. పైకి ఎవరి పేర్లున్నా ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీయే అని ప్రచారం జరుగుతోంది. బుధవారం ఎపిఎన్జీవోలు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్ వేదికపై కూడా కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సంకేతాలు వెలువడే అవకాశముందంటున్నారు.
సిఎం కొత్త పార్టీ పెట్టాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా ఆయన పార్టీ పెట్టేస్తున్నారని వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు, ధ్రువీకరించలేదు. వెయిట్ చేయాలని మాత్రమే చెప్పారు. దీంతో కొత్త పార్టీ వార్తలను ఆయన పరోక్షంగా బలపరిచినట్లు అవుతోంది.
'సమైక్యాంధ్రను విధానం'గా ఎంచుకున్న కిరణ్ ఇక కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితి లేదని, ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమని పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. కాగా, మంగళవారం తుని ఎమ్మెల్యే రాజా కృష్ణంరాజు అసెంబ్లీలోని సిఎం కార్యాలయంలో కిరణ్ను కలిశారు. ఆయన ముదురు కాషాయం రంగు చొక్కా వేసుకున్నారు. 'ఏమిటీ కొత్త షర్టు?' అని కొందరు ప్రశ్నించగా ముఖ్యమంత్రి స్థాపించే కొత్త పార్టీ రంగు ఇదే అని ఆయన సిఎం ముందే సమాధానమిచ్చారట.