నినాదాల మధ్యే లోక్పాల్: నోటీసు పక్కన పెట్టిన స్పీకర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల సమైక్య నినాదాల మధ్యనే లోకసభ లోక్పాల్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతకుముందు టిడిపి ఎంపీ కొణకళ్ల నారాయణ, కాంగ్రెసు ఎంపి సబ్బం హరిలు అవిశ్వాస తీర్మానంపై నోటీసును ఇచ్చారు. ఇది తనకు అందిందని స్పీకర్ ప్రకటించారు.
అనంతరం లోకసభలో లోక్పాల్ బిల్లు పైన చర్చ ప్రారంభమైంది. సీమాంధ్ర ఎంపీలు చర్చ జరుతుండగానే వి వాంట్ జస్టిస్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని, అధికారపక్ష సభ్యుల తీరుతో సభ సజావుగా సాగడం లేదని, సభలో ప్రశాంత పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సుష్మ కోరారు. సీమాంధ్రుల నినాదాల మధ్యనే లోకసభలో లోక్పాల్ బిల్లును ఆమోదించారు. అనంతరం లోకసభ నిరవధిక వాయిదా పడింది.

కాగా, తాము ఇచ్చిన నోటీసును స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా నోటీసులు పక్కన పెట్టారని ఆరోపించారు.
మరోసారి సుప్రీంకు వెళ్లే యోచనలో టిడిపి
విభజనపై మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు. విభజనపై కోర్టులో పెండింగులో ఉన్న సిఎం రమేష్ పిటిషన్ విచారణకు వచ్చేలా ప్రయత్నాలు చేయాలని లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మళ్లీ సుప్రీంకు వెళ్లాలని భావిస్తున్నారు.
శాసన సభ రేపటికి వాయిదా
మరోవైపు రెండుసార్లు వాయిదా పడిన అనంతరం శాసన సభను నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుండి ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించారు. బిల్లుపై చర్చించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications