హైదరాబాదులో సీమాంధ్ర ఎంపీల సమైక్య దీక్ష
హైదరాబాద్: సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రేపటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన సంకల్ప దీక్షకు పోలీసుల అనుమతి లభించింది. రేపు, ఎల్లుండి సమైక్యాంధ్రకు మద్దతుగా ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, సాయిప్రతాప్ పాల్గొంటారు.
సమైక్యాంధ్ర కోసమే తాము సంకల్ప దీక్ష చేస్తున్నట్లు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అందరిలోనూ తాము మార్పు తెస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తమ సహచర పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మాటలు సరి కావని ఆయన అన్నారు. మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల దీక్షకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటలకు తమ దీక్ష ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.
పార్లమెంటులో తెలంగాణ ముసాయిదాబ బిల్లు ఆమోదం పొందదని లగడపాటి రాజగోపాల్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతాయా, లేదా ఇంకా ఏమైనా జరుగుతుందా అనే విషయంలో ముందు ముందు సినిమా చూడబోతున్నారని ఆయన అన్నారు.
కాగా, తాను వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు సీటు నుంచే పోటీ చేస్తానని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చెప్పారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగడం లేదని ఆయన గురువారం ఏలూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. మంత్రివర్గంలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
రేపు శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆరుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సంకల్ప దీక్షకు పూనుకున్నారు. సీమాంధ్ర ఎంపీల దీక్షను అడ్డుకుంటామని తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధిలో సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉండదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు.