మీకోసం శత్రువుల్ని వెనకేస్కున్నా, జగన్ లీడరా: పవన్
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. సీమాంధ్ర ప్రజలు.. తల్లి కాంగ్రెసు పార్టీని తిరస్కరించినట్లే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పిల్ల కాంగ్రెసును కూడా తిరస్కరించాలని పవన్ పిలుపునిచ్చారు.
ఎప్పటికైనా జైలుకు వెళ్లే జగన్ను గెలిపించాలా లేక సీమాంధ్రను అభివృద్ధి చేయగల చంద్రబాబు నాయుడును గెలిపించాలా ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి పదవి పైన అధికారదాహంతో తల్లిని కష్టపెడుతున్న జగన్ నాయకుడు ఎలా అవుతాడని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఎవరైనా నాలుగు రాళ్లను వెనుకేసుకోవాలని చూస్తారని, తాను మాత్రం ప్రజల కోసం నలభై మంది శత్రువులను వెనుకేసుకున్నానని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాయని, డబ్బు పంచితే తీసుకొని ఓటు మాత్రం టిడిపికి వేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. దొందు దొందే అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసమే తాను ప్రచారం చేస్తున్నానని చెప్పారు. కీలక తరుణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తెలుగుజాతి ఐక్యత కోసమే తన ప్రయత్నమన్నారు.
2009 నుండి తాను రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నానని చెప్పారు. తనకు అధికార దాహం లేదన్నారు. 2009లోనే పోటీ చేసి అధికారంలోకి వచ్చేవాడినని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరు లేరని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల కోసమే తన పోరాటమన్నారు.
సీమాంధ్రను కించపర్చేలా కెసిఆర్ మాట్లాడుతున్నా జగన్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. తండ్రి మరణించగానే సిఎం పదవి కోసం జగన్ ఆరాటపడ్డారన్నరు. బిసి ప్రధానని ఏమైనా అంటే తాను ఊరుకోనని చెప్పారు. భారత దేశ జాతి సమగ్రతను చెడగొట్టవద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications