తెలంగాణలో సీమాంధ్రులు ఈసారి ఎటువైపు?
విద్యా, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపార రీత్యా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోయినవారిని సీమాంధ్రులు అని పిలుస్తున్నారు. తెలంగాణ సమాజం వారిని కలుపుకున్నా తెలంగాణా వాసులకన్నా సీమాంధ్రులుగానే పేరుగడించారు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా, సీమాంధ్రులు ప్రభావితం చేయగలిగే స్థానాలు 25 నుంచి 28 వరకు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరంతా తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, ఇతర చోట్ల బీజేపీ గెలిచింది. అంటే తెలంగాణవాసులు బీజేపీవైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈసారి ఎలాగైనా విజయ బావుటా ఎగరవేయాలి
తెలంగాణలో ఈసారి ఎలాగైనా విజయబావుటా ఎగరవేయాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతాపార్టీ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచించుకుంటూ వస్తోంది. సీమాంధ్రులు ఉన్న స్థానాలను, వారి ఓట్లను సాధించేలా వ్యూహం రచిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్కు ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీకానీ, హోదాకానీ, నిధులుకానీ ఇంతవరకు ఒక్కరూపాయి కూడా కేంద్రం విదిలించలేదు. రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇంతవరకు రాజధాని లేదు. పేరుకు మూడు రాజధానులంటున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజధాని ఏమిటి? అంటే ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకు ఒకరకంగా కేంద్రంలో అధికారంలో భారతీయ జనతాపార్టీ కూడా కారణమని ఏపీ ప్రజల భావనగా ఉంది.

అంత సులభంగా ఓట్లు దక్కుతాయా?
భారతీయ జనతాపార్టీపై అటువంటి అభిప్రాయంతో ఉన్నవారి నుంచి ఓట్లు అంత సులభంగా దక్కుతాయా? అంటే కష్టమనే అంటున్నారు సీనియర్ రాజకీయ వేత్తలు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎక్కువ నష్టం చేసిందనే భావన ఆంధ్రులందరిలో ఉంది. అప్పు చేసుకోవడానికి కూడా దేహీ అని ప్రాధేయపడే పరిస్థితి తెచ్చారని ప్రజలంతా మండిపడుతున్నారు.

తెలంగాణలో విజయం సాధించాలంటే ఏం చేయాలి?
తెలంగాణలో విజయం సాధించాలంటే వీరిలో ఉన్న ఇటువంటి భావనలను ముందుగా తొలగించాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలపై ఉంటుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా మూడురోజులపాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్న నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ నేతలకు ఇవన్నీ తెలియనివి ఏమీకాదు. ఏపీని సంతృప్తి పరిస్తే తెలంగాణలో సులువుగా విజయం దక్కుతుందనే యోచనలో తెలంగాణ బీజేపీ నేతలున్నారు. అందుకు తగ్గట్లుగా ఆ పార్టీ ఇప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తోంది? భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి? ఎవరిని మిత్రులుగా చేసుకోవాలి? లాంటి విషయాలన్నీ వారికి తెలుసని, అవన్నీ చేసి నమ్మకం కలిగిస్తే కచ్చితంగా ఇక్కడి సీమాంధ్రులు బీజేపీని ఆదరించే అవకాశం ఉందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications